జగన్కు మరో షాక్: రాజీనామా లేఖ పంపిన జూపూడి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. గత కొంత కాలంగా పార్టీకి అండగా ఉన్న దళిత నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడనున్నారు. తన రాజీనామా లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని పరిణామాలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని, అందుకే పార్టీని వీడుతున్నానని ఆయన చెప్పారు.
శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన తన నిర్ణయాన్ని తెలియజేశారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా కొండేపి నుంచి జూపూడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపు పోటీ చేసి ఓడిపోయారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న గౌరవంతోనే తాను ఇన్నాళ్లు పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తండ్రి లేని జగన్కు తాను అండగా ఉంటానని గత ముఖ్యమంత్రులకు తాను చెప్పినట్లు జూపూడి తెలిపారు.
ఇప్పటికీ వైవి, బాలినేని మాట్లాడుకోరని ఆయన చెప్పారు. సామంత రాజుల్లా జిల్లాను కుటుంబ సభ్యులకు అప్పగించారని ఆయన ఆరోపించారు. జగన్ కుటుంబంపై ఈగ వాలకుండా చేసిన తనను దూరం పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత జగన్కు జూపూడీ గతంలో లేఖ రాశారు. అయితే దీనిపై జగన్ స్పందిచకపోవడంతో జూపూడి మనస్తాపానికి గురయ్యారు.
గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జగన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపూడి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జూపూడితో పాటు పలువురు దళిత నేతలు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడనున్నట్లు సమాచారం.