'జగన్ లొంగిపోయారనుకుంటున్నారు': పార్టీపై కిరణ్ నో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి లొంగిపోయారన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిందని కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పారట. ముఖ్యమంత్రితో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వీరశివా రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, కందుల శివానందరెడ్డి, శివరామకృష్ణా రావు తదితరులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ప్రజలు నమ్మడం లేదని చెప్పారట. కాంగ్రెసుకు జగన్ లొంగిపోయారన్న భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిందని, సమైక్యంపై ఆ పార్టీ ఏం చెప్పినా జనం వినిపించుకునే స్థితిలో లేరని చెప్పారట. అదే సమయంలో పలువురు నాయకులు కాంగ్రెసు విభజనపై ముందుకు వెళ్తున్న తరుణంలో కొత్త పార్టీ విషయమై సిఎం దృష్టికి తీసుకు వెళ్లారు.
అందుకు కిరణ్ మాత్రం సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరుగుతాయని హామీ ఇచ్చారట. కొత్త పార్టీ ఊసే ఎత్తవద్దని సూచించారట. సమైక్య సంకల్పం గొప్పదని, రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోను విడిపోదని భరోసా ఇచ్చారని తెలుస్తోంది. తాను రెండుసార్లు విలేకరుల సమావేశంలో విభజనతో వచ్చే నష్టాలను చెప్పానని, అవసరమైతే మళ్లీ స్వరం పెంచుతానని చెప్పారట. అయితే కొత్త పార్టీ ఊసు మాత్రం ఎత్తవద్దని సూచించారట.
జగన్ ఇలాకా నుండే రచ్చబండ!
కడప జిల్లా నుండే రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రిని జిల్లా నేతలు కోరగా ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎక్కడ నిర్వహించుదామని వారిని ప్రశ్నించారు. ఏ నియోజకవర్గమైన ఫరవాలేదని, తాము ఏర్పాట్లు చేస్తామని చెప్పారట.