AP Elections: కడప టు అమరావతి - సీఎం జగన్ ఎలక్షన్ టీం స్పెషల్..!!
CM Jagan Election Team: సీఎం జగన్ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల టీంలను సిద్దం చేసుకుంటున్నారు. తన మూడున్నారేళ్ల పాలన తరువాత ప్రజల్లో తన పాలన పైన ఫీడ్ బ్యాక్ కోసం పార్టీ ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపారు. ప్రజల వద్దకు ఎమ్మెల్యేలు వెళ్తున్న సమయంలో ఎదురవుతున్న స్పందనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని కోసం పాలనా పరంగా తన యాక్షన్ ప్లాన్ అమలు చేసే బాధ్యత లను ఎంపిక చేసుకున్న టీంకు అప్పగించారు. ఆ టీం సారధ్య బాధ్యతలను ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డికి.. పార్టీ వ్యవహారాలను సజ్జలకు కేటాయించారు. అదే సమయంలో పోలీసు బాస్ గా రాజేంద్రనాధ్ రెడ్డి ఉన్నారు. సీఎంకు కీలకమైన ఈ మూడు విభాగాలను కడప జిల్లాకు చెందిన వారే లీడ్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియమితులయ్యారు. తొలి నుంచి జవహర్ రెడ్డి పైన సీఎం జగన్ కు మంచి గురి ఉంది. కరోనా సమయంలోనూ వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను జవహర్ కు అప్పగించారు. టీటీడీలో పని చేస్తున్న సమయంలో తన కార్యాలయంలో అధికారిగా నియమించారు. ఇక, ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మూడున్నారేళ్ల పాలనా సమయంలో రెండేళ్లు కరోనాతో సరి పోయింది. ఎన్నికలకు మిగిలిన సమయంలో ఇప్పుడు పాలనా పరంగా కీలకమైనది. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అంచనాలకు తగినట్లుగా పని చేయించటం పాలనా బాస్ గా సీఎస్ జవహర్ రెడ్డి పైన ఉంది. జవహర్ రెడ్డిది కూడా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం. ఆయనది సింహాద్రి పురం మండలంలోని కసునూరు.
పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిది కడప జిల్లానే. రాజుపాలెం మండలం లోని పల్లంపాడు స్వగ్రామం. అదే విధంగా.. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల సైతం కడప జిల్లా వారే. ప్రభుత్వ సలహాదారుగా అటు పార్టీలు..ఇటు ప్రభుత్వ నిర్ణయాల్లోనూ ఆయన పాత్ర కీలకంగా ఉంటోంది. దీంతో, సీఎం జగన్ తో పాటుగా ఈ ముగ్గురు కీలక స్థానాలు చూస్తన్న వారు కడప జిల్లాకు చెందినవారే కావటం ప్రత్యేకంగా నిలుస్తోంది. రాష్ట్ర పాలనలో ఇదొక అరుదైన అంశంగా మారుతోంది. అయితే, ప్రతిపక్షాలకు ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా, ఇప్పుడు సీఎస్ గా జవహర్ రెడ్డిని నియమించటం తో.. సీఎం జగన్ తరువాతి నిర్ణయాల్లో ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తి పెంచుతోంది. ఇక వైపు పార్టీ పరంగా..ఇటు పాలనా పరంగా రెండింటా తన కొత్త టీంలను దాదాపు సిద్దం చేసుకున్న ముఖ్యమంత్రి.. జనవరి నుంచి కొత్త అడుగులు వేసేందుకు సిద్దం అవుతున్నారు.