ఆసుపత్రిలో రాత్రి బస: సౌకర్యాలపై మంత్రులు ఆరా
గుంటూరు: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 4.5 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. 10 రోజుల్లో గుండె శస్త్ర చికిత్సలు కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
ఆదివారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. అందరికీ మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

శనివారం రాత్రి ఆసుపత్రిలోని మిలినియం బ్లాకులోనే మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణలు రాత్రంతా బస చేశారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. మిలినియం బ్లాక్లో సౌకర్యాలను పరిశీలించడంతో పాటు, రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పుల్లారావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, సూపరింటెండెంట్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications