బీజేపీలో చేరిన కన్నా, జగన్ పార్టీ కొణతాల కూడానా!
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సొంత పార్టీకి షాకిచ్చారు. ఆయన మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. కన్నా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిశారు. అనంతరం షా, బీజేపీ నేత రామ్ మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
తన చేరిక పైన కన్నా మాట్లాడుతూ... తాను సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నిస్వార్థంగా పని చేస్తున్నారని, ఆయన పట్ల ఆకర్షితుడనై తాను బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. కన్నా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్నో కీలక పదవుల్లో పని చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
కన్నా లక్ష్మీనారాయణ దారిలోనే మరికొందరు ఆంధ్రప్రదేశ్ నేతలు నడుచుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొణతాల రామకృష్ణ మంగళవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన పార్టీని కూడా వీడనున్నారని అంటున్నారు. కొణతాల కూడా బీజేపీలోకి వెళ్తారా అనే చర్చ సాగుతోంది.
కొణతాలతో పాటు ఇద్దరు ముగ్గురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వనున్నారని, వారు పార్టీని వీడి జాతీయ పార్టీలో చేరే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ జాతీయ పార్టీ బీజేపీయే కావొచ్చునని అంటున్నారు.
ఏపీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ను వీడాలనుకునే వారు, వైసీపీకి చెందిన కొణతాల వంటి వారు బీజేపీలో చేరవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే కన్నా బీజేపీలో చేరారు.
కేసీఆర్ మోసం చేశారు: సిరిసిల్ల రాజయ్య
ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగమన్నది లేకుండా చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత తెలంగాణ యువకులను మోసం చేశారని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. పావలా రుణమాఫీ చేసి మొత్తం రుణాలన్నీ మాఫీ చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ వ్యాప్తంగా విధిస్తున్న విద్యుత్ కోతలతో కేసీఆర్ అసమర్ధత బయటపడిందని ఆయన విమర్శించారు. విద్యుత్ కోతల కారణంగానే తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కేసీఆర్ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.