ముద్రగడకు సవాల్, టార్గెట్ 2019: బాబుని ఓడించాలనే జగన్తో చేతులు కలిపారా?
అమరావతి: కాపులను అడ్డు పెట్టుకుని ముద్రగడ పద్మనాభం రాజకీయాలు చేస్తున్నారని కాపు కార్పోరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ విమర్శించారు. బుధవారం విజయవాడలోని కార్పొరేషన్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఓడించేందుకే ముద్రగడ ప్రతిపక్ష నేత వైయస్ జగన్తో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే దాసరి నారాయణరావు, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణతో కలిసి వైసీపీకి లబ్ధిచేకూరేలా ముద్రగడ కార్యక్రమాలు రూపొందిస్తున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతికి దోహదపడుతుంటే ముద్రగడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో 30 మంది కాపులు వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిధులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వైయస్ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్ట్లో కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ అది నెరవేరలేదని అన్నారు.
ఈ విషయం ముద్రగడకు తెలిసి కూడా మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ రెండు అంశాలపై ముద్రగడ బహిరంగ చర్చకు సిద్ధమా? అని రామానుజయ సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే కాపు రిజర్వేషన్ల ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణపై కాపు ముఖ్య నేతలతో ముద్రగడ మంగళవారం సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కాపుపెద్దల నుంచి మద్దతు, ఆమోదముద్ర లభించింది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నియోజకవర్గం నుంచి ముద్రగడ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు.
హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో కాపునాడు సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈనెలాఖరులోగానీ వచ్చే నెల మొదటి వారం నుంచి గానీ ముద్రగడ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇదే విషయాన్ని సమావేశం ముగిసిన అనంతరం బొత్స సత్యనారాయణతో కలసి దాసరి నారాయణరావు, ముద్రగడ విలేఖరులకు వివరించారు.