వైసీపీలో ముద్రగడ చేరికకు రంగం సిద్ధం ? రెండ్రోజుల్లో కొడుకు చల్లారావు టికెట్ పై క్లారిటీ ?
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరికకు రంగం సిద్దమవుతోంది. విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటేనే మండిపడుతున్న ఆయన.. త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీలో చేరినా ఎన్నికల్లో పోటీకి ఆయన మొగ్గు చూపడటం లేదు. దీంతో ఆయన కుమారుడు ముద్రగడ చల్లారావుకు వైసీపీ టికెట్ కేటాయించేందుకు చర్చలు జరుగుతున్నాయి.

గతంలో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంతో అమీతుమీ అన్నట్లుగా వ్యవహరించి వైసీపీకి మిత్రుడిగా మారిన ముద్రగడ పద్మనాభం.. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా యాక్టివ్ కాలేదు. కానీ ఇప్పుడు కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురు నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లి పలుమార్లు చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు సందర్భంగా ముద్రగడ ఆ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. అయితే కొడుకు చల్లారావు రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ దొరికితేనే ఆయన పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గోదావరి జిల్లాల్లో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుపై కాక రేగుతోంది. ఈ తరుణంలో ముద్రగడ చల్లారావును కాకినాడ ఎంపీగా లేదా పెద్దాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చని తెలుస్తోంది.
కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తున్నారు. అలాగే పెద్దాపురంలో గతంలో పోటీ చేసిన తోటవాణి స్ధానంలో ఈసారి ఆమె భర్త తోట నర్సింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దాపురం సీటులో ఎమ్మెల్యేగా లేదా కాకినాడ ఎంపీగా ముద్రగడ చల్లారావుకు టికెట్ కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అర్ధబలం ఆధారంగా టికెట్ల కేటాయింపు ఉండే అవకాశాలు ఉన్న తరుణంలో దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ తర్వాత ముద్రగడ వైసీపీలో చేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications