Pawan Kalyan: ఇంట గెలిచిన పవన్ ? ఎన్నికల వేళ బిగ్ సక్సెస్ ..!
ఏపీలో 2009 ఎన్నికల సమయంలో పుట్టిన ప్రజారాజ్యం పార్టీ తొలిసారిగా రాష్ట్రంలో కాపుల ఓట్లను ఏకీకరణ చేసేలా కనిపించింది. భారీ అంచనాలతో పార్టీ పెట్టిన చిరంజీవి.. దాన్ని అదే స్పీడులో జనంలోకి తీసుకుపోవడంలో విఫలమయ్యారు. దీంతో ఎంత స్పీడుగా నేతలు ప్రజారాజ్యంలో చేరారో అంతే స్పీడుగా విమర్శలు చేస్తూ బయటికి వెళ్లిపోయారు. చివరికి కాపుల వాయిస్ గా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న చిరంజీవి కల నెరవేరలేదు. ఈ ప్రయోగం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది.
ఆ తర్వాత ఐదేళ్లకు జనసేన పార్టీలో ముందుకొచ్చిన పవన్ అభ్యర్ధుల్ని పోటీ చేయించకపోయినా టీడీపీ-బీజేపీకి అందించిన మద్దతు వారిని అధికారంలోకి తెచ్చింది. ఐదేళ్ల తర్వాత ఇరు పార్టీలతో విభేదించి జనసేనను ఒంటరిపోరు దిశగా నడిపించిన పవన్ కు దక్కింది ఏకైక సీటు మాత్రమే. తానే స్వయంగా రెండు చోట్ల ఓడిపోవడంతో పవన్ రూటు మార్చక తప్పలేదు. ఓవైపు బీజేపీతో పొత్తులో ఉంటూ, మరోవైపు టీడీపీతోనూ పొత్తు కోసం పావులు కదిపిన పవన్.. అనుకున్నది సాధించారు. ఇప్పుడు టీడీపీతో పాటు బీజేపీని కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తద్వారా సొంత వర్గంలోనూ ఆశలు పెంచారు.

చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని వారాహి యాత్రకు బయలుదేరగానే ఆయన సామాజికవర్గం కాపుల్లో చీలిక కనిపించింది. ముఖ్యంగా కీలక నేతలైన హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం పవన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారారు. నాలుగు నెలల్లోనే పరిస్ధితి మారిపోయింది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న పవన్ మళ్లీ వ్యూహం మార్చారు. తనను వ్యతిరేకిస్తున్న ముద్రగడ వద్దకు దూతను, రాయబారాన్ని పంపారు. కాపులంతా కలిసుందామని అడిగారు. దీంతో ముద్రగడ కూడా వెనక్కి తగ్గారు. జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పుడు పవన్ పార్టీ జనసేన వెంట ముద్రగడ, జోగయ్య రూపంలో రెండు భిన్న ధృవాలున్నాయి. అలాగే గోదావరి జిల్లాలతో పాటు కాపులు కూడా 80శాతం ర్యాలీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సానుకూల సంకేతాలు ఇతర సామాజిక వర్గాల్ని కూడా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలో గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ వంటి వారు కూడా జనసేనలోకి వస్తామంటూ సంకేతాలు పంపుతున్నారు. మొత్తంగా పవన్ ఇంట గెలిచారు. అదీ కీలకమైన ఎన్నికల వేళ మిత్రపక్షం టీడీపీని డిమాండ్ చేసే స్ధాయికి ఎదుగుతున్నారు.












Click it and Unblock the Notifications