ఏపీలో జంపింగ్స్: బీజేపీలోకి 'కీ'లక నేతలు, పవన్ ఎఫెక్ట్ కూడా..!
హైదారాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీగా వలసలు ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.
దాంతోపాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, క్రమంగా ఒక్కో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుండటంతో పలువురు నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్రానికి బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ పలువురు కీలక నేతల చేరికలో పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ఇక బీజేపీకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు ఎలాగూ ఉంది.
పవన్ జనసేన పార్టీని క్రియాశీలకం చేసే వరకు ఆయనకు మద్దతిచ్చేవారు, ఆయనకు సంబంధించిన వారు బీజేపీ వైపే చూస్తారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లలేని పలువురు కాపు, రెడ్డి నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కాపు నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. ఆయన తర్వాత కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నుండి పలువురు చేరవచ్చునని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి కన్నా చేరారు. ఆ తర్వాత పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పేరు కూడా వినిపించింది. బీజేపీలో ఆయన చేరవచ్చునని ఇటీవల ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అలాగే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తదితరులు బీజేపీలో చేరే అవకాశాలు కొట్టిపారేయలేమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీలోకి వచ్చే పలువురు అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు, కొణతాల రామకృష్ణ రావు, దాడి వీరభద్ర రావులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని అంటున్నారు. వారు టీడీపీలోకి వస్తే తాను స్వాగతిస్తానని, తన కార్యకర్తలకు నచ్చ చెబుతానని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పిన విషయం తెలిసిందే.