కార్తీకమాసంలో చేయాల్సిన పనులు ఇవే..!!
Karthika Masam 2024: ఇంకొద్ది రోజుల్లో పవిత్ర కార్తీకమాసం ప్రారంభం కానుంది. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీకమాసం ఆరంభమౌతుంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి శైవక్షేత్రాలన్నీ కార్తీక శోభను సంతరించుకుంటాయి. ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తుంటారు.
ఈ నెలలో సముద్రం, నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తెల్లవారు జామునే సముద్రం/నదీ స్నానం చేయడం, గంగమ్మ తల్లికి పూజలు చేయడం, దీపాలను వెలిగించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అయ్యప్ప భక్తులు మాలధారణ చేసేదీ ఈ నెలలోనే.

ఈ మాసంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో పూజించితే శివస్థానాన్ని పొందుతారని ప్రశస్తి. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఏటా వేల సంఖ్యలో భక్తులు తిరుపతి కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ కార్తీకమాసంలో కపిలేశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా భక్తుల భారీగా తరలివస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తోన్నారు.
కార్తీకమాసం పొడవునా కపిలేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నవంబరు 4, 11, 18, 25వ తేదీలలో తెల్లవారు జామున 2 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు.
తెల్లవారు జామున 5 నుండచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టారు.
డిసెంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు చండికేశ్వరస్వామికి అభిషేకం, త్రిశూల స్నానం జరుగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు లక్షదీపారాధన, పంచమూర్తులైన విఘ్నేశ్వరస్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహించనున్నారు. అనంతరం పంచమూర్తులను వైభవంగా ఊరేగిస్తారు.












Click it and Unblock the Notifications