కుదరదు: హైద్రాబాద్పై కావూరికి షిండే, ప్రోరోగ్పై డిసిఎం
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, జెడి శీలంలకు మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు గురువారం షాక్ ఇచ్చారు! హైదరాబాదును యూటి చేయడం సాధ్యంకాదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. హోంశాఖ కార్యాలయంలో జివోఎం సమావేశం ముగిసిన వెంటనే కావూరి, జెడి శీలంలు వెళ్లి సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్తో సమావేశమయ్యారు.
హైదరాబాద్ మెట్రోపాలిటిన్ అభివృద్ధి అథారిటీ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయటంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తేనే సీమాంధ్రులకు న్యాయం చేసినట్లు అవుతుంది, తాము కూడా రాష్ట్ర విభజనకు సహకరిస్తామని, అలా చేస్తే సీమాంధ్రులకు కొంతైనా ఊరట కలుగుతుందని కూడా వారు చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు ఎంత పెద్ద ప్యాకేజీ ఇచ్చినా దాని వలన పెద్దగా లాభం ఉండదని వారు స్పష్టం చేశారట.
షిండే, జైరాం రమేష్ సీమాంధ్ర మంత్రులు చెప్పినదంతా సావకాశంగా విన్న అనంతరం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటం ఎంతమాత్రం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధాని చేస్తామని షిండే చెప్పారట. షిండే ఇచ్చిన సమాధానం పట్ల ఇరువురు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
ప్రోరోగ్ వద్దు: దామోదర
అసెంబ్లీని ప్రోరోగ్ చేయవద్దని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గవర్నర్ నరసింహన్ను కోరారు. ఈ మేరకు గురువారం ఆయనకు లేఖ రాశారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ బిల్లు వేగంగా ముందుకు వెళుతున్న తరుణంలో ఏ క్షణమైనా శాసన సభలో చర్చకోసం ప్రభుత్వానికి రాష్ట్రపతి పంపించే అవకాశం ఉందని, ప్రోరోగ్ అయితే మళ్లీ సమావేశం కావడానికి కొంత సమయం పడుతుందని, బిల్లును జాప్యం చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చకు ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు, సభను ఏ క్షణమైనా సమావేశ పరిచేందుకు వీలుగా ప్రోరోగ్ చేయవద్దని గవర్నర్ను కోరారట.