అటెండర్ లేకనే!: బాబును పిలవకపోవడంపై కెసిఆర్
హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపక పోవడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ టిడిపి నేతలతో స్పందించినట్లుగా తెలుస్తోంది.
ఆహ్వాన పత్రం పంపించటానికి తన దగ్గర అటెండర్ కూడా లేడని, ఏం చేయాలని, అందువల్లే చంద్రబాబును పిలవలేకపోయానని, తనకు వేరే ఉద్దేశం ఎంత మాత్రం లేదని టిటిడిపి నేతలతో కెసిఆర్ అన్నారట.
మంగళవారం సచివాలయంలో కెసిఆర్ను టిటిడిపి నేతలు కలిసిన విషయం తెలిసిందే. టిడిఎల్పీ నేత ఎల్ రమణ అధ్వర్యంలో దేశం ప్రతినిధి బృందం కలిసి ఈ నెల 8న గుంటూరులో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావలసిందిగా ఆహ్వానించింది.
పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర రావు, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఈ బృందంలో ఉన్నారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీలో సిఎస్ తప్ప తనకు ఎవ్వరూ అందుబాటులో లేరని దీంతో చంద్రబాబుకు ఆహ్వాన పత్రాన్ని పంపలేకపోయినట్టు వివరణ ఇచ్చారట. తెలంగాణ ఎమ్మెల్యేలైన తమకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు అందలేదని, ఎస్సెమ్మెస్లు మాత్రమే వచ్చినందున తాము రాలేక పోయామని తలసాని కెసిఆర్తో అనగా ఆ విషయం తనకు కూడా తెలియదని ఆయన చెప్పారట.