రేవంత్ వ్యాఖ్యలు రికార్డ్: కేసీఆర్, మతంకాదంటే కేటగిరీగా, సభలో కాంగ్రెస్ రివర్స్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి అంశం పైన స్పందించారు. తనను సభలో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని రేవంత్, టీడీపీ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ రోజు జరిగిన అంశంపై స్పందించారు. పోయి దొర బూట్లు నాకు పో అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ మినట్స్లో ఆన్ రికార్డుగా ఉన్నాయని చెప్పారు. ఈ విషయం సభాపతికి కూడా తెలుసన్నారు.
శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు పైన చర్చ సందర్భంగా సభాపతి వివిధ పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. టీడీపీ నుండి ఎర్రబెల్లి దయాకర రావు పేరును సభాపతి పిలిచారు. అయితే ఎర్రబెల్లికి బదులు రేవంత్ లేచి మాట్లాడే ప్రయత్నం చేశారు. రేవంత్ ప్రసంగాన్ని అధికార తెరాస సభ్యులు అడ్డుకున్నారు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిల్లు పైన తమకు మాట్లాడే అవకాశమివ్వాలన్నారు. అయితే, తెరాస పట్టు వీడలేదు. తమ పార్టీ సభ్యుడిని మాట్లాడనీయక పోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రేవంత్ తప్పుగా మాట్లాడితే సభాపతి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అందరిని కలుపుకొని పోదామన్న సీఎం మాటలను నమ్ముతున్నామని, తమ పార్టీ సభ్యుడు మాట్లాడకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.

ఎర్రబెల్లి మాట్లాడుతుంటే కూడా తెరాస సభ్యులు అడ్డు తగిలారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. కాగా, ఈ బిల్లును కేసీఆర్ శాసన ప్రవేశ పెట్టగా సభ ఆమోదించింది. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలి కూడా ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధికంగా వాయిదా పడింది.
కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయు. బిల్లుకు మద్దతిచ్చినందుకు కేసీఆర్ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ విప్ పక్కన పెట్టి మద్దతిచ్చింది. విప్ ద్వారా తెరాసలో చేరిన ఎమ్మెల్యేలను ఇరుకున పెడదామనుకన్న కాంగ్రెస్ చివరకు అసెంబ్లీలో బిల్లుకు మద్దతిచ్చి షాకిచ్చింది.
తమిళనాడు తరహా చట్టం
తాము ఎన్నికల ప్రచారం సమయంలో హామీ ఇచ్చినట్లుగా ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. తమిళనాడు తరహా చట్టం తీసుకు వస్తామని చెప్పారు. మతం పేరుతో రిజర్వేషన్లు వద్దంటే కేటగిరీ పేరుతో ఇస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ముస్లీంల గణ నివేదికకు కమిటీ వేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications