మాటమీద నిలబడు: కెసిఆర్కి కవిత, మందకృష్ణ సలహా
తెలంగాణ ప్రాంతంలో లీడర్, కేడర్ ఉన్న పార్టీ కాంగ్రెసు మాత్రమేనని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీలో విలీనం కాకపోయినా తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో ఐక్యత ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ఒంటిచేత్తో విజయం సాధిస్తుందన్నారు.
కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడాలని కేంద్రమంత్రి బలరాం నాయక్ అన్నారు. ప్రాజెక్టులు, అభివృద్ధిపై కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్ర అభివృద్ధి అసాధ్యమని చెప్పారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తానన్న కెసిఆర్ ఇప్పుడు మాట తప్పుతున్నారన్నారు.
ఇంటింటికీ ప్రచారం
కెసిఆర్ విలీనం చేయనని తేల్చడంతో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఇక ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఓట్లు చీలకుండా ఉండేందుకే తాము తెరాస విలీనం అడిగామని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. పునర్ నిర్మాణం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు.
కెసిఆర్కు మందకృష్ణ సూచన
తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీగానే కొనసాగాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వేరుగా సూచించారు. తెరాస ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. రాయల తెలంగాణ వ్యతిరేకించిన కెసిఆర్.. ముంపు ప్రాంతాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టి కాంగ్రెసు నేతలు విలీనం చేయాలని అడగటం హాస్యాస్పదమన్నారు.
రమ్య ఫిర్యాదు
కెసిఆర్పై ఆయన అన్న కూతురు రమ్య హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. కెసిఆర్ను విమర్శించినందుకు తన ఫంక్షన్ హాల్పై దాడి చేయడమే కాకుండా తన భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను అక్రమంగా పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే తెరాస బెదిరింపులకు దిగుతోందన్నారు. కుటుంబ పునాదులనే కాపాడుకోలేని కెసిఆర్ తెలంగాణ పునర్నిర్మాణం ఏం చేస్తారని ప్రశ్నించారు.