తప్పేం మాట్లాడలేదు: మీడియాపై గవర్నర్తో కెసిఆర్
హైదరాబాద్: మీడియాపై తాను చేసిన వ్యాఖ్యలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమర్థించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్లు, తెలంగాణ సమాజాన్ని గౌరవించాలనే కోణంలోనే తాను మాట్లాడానని ఆయనకు చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ తొలుత పరిపాలనాపరమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు మీడియాలో శనివారం వార్తలు వచ్చాయి.
తర్వాత తనంత తానుగా ఇటీవల వరంగల్లో కాళోజీ శతజయంతి వేడుకల సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించారని ఆ కథనాల సారాంశం. తాను వ్యతిరేకంగా ఏమీ అనలేదని, తప్పుగా మాట్లాడింది కూడా ఏమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణ గడ్డపై ఉండాలని అనుకుంటున్నప్పుడు, ఇక్కడి ప్రజలను అవమానించకూడదనే దృక్పథంతోనే మాట్లాడానని అయినా కావాలని మీడియా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని చెప్పారు.
తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాల నిలిపివేత నిర్ణయం కేబుల్ ఆపరేటర్లు తీసుకున్నారని, ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు. ఏదైనా ఉంటే ఆ చానళ్ల యాజమాన్యాలు కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడుకోవాలని, అసలు ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధంలేదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన చానళ్ల ప్రసారాలను నిలిపివేశారని, ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన టీవీ చానళ్ల ప్రసారాలు ఇక్కడ ఎందుకనే భావనలో కేబుల్ ఆపరేటర్లు ఉన్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల న్యూస్ కవరేజీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన కొన్ని టీవీ చానళ్లు, పత్రికల ప్రతినిధులను అనుమతించలేదని ఫిర్యాదు చేశారు. కేసీఆర్ చెప్పిన విషయాలన్నిటినీ గవర్నర్ మౌనంగా విని ఊరుకున్నారని సమాచారం.