ఉమ వర్సెస్ కేశినేని: బాబు వద్దకు బెజవాడ పంచాయతీ
విజయవాడ: విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు మరింత రాజకుంది. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య చిచ్చు తారాస్థాయికి చేరుకోవడంతో పంచాయతీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చెంతకు చేరింది. పార్లమెంటు సభ్యుడు కేశినేని శుక్రవారంనాడు చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రతిస్పందించింది. దాంతో ఆయన శనివారం సాయంత్రం 3 గంటలకు చంద్రబాబును కలువనున్నారు.
కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని చంద్రబాబుకు వివరించాలని ఆయన అనుకుంటున్నారు. గత ఆరు నెలల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యవహరించిన తీరుపై ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో తన వ్యాఖ్యలపై చంద్రబాబుకు వివరణ ఇవ్వనున్నారు. దేవినేని ఉమామహేశ్వర రావుకు, కేశినేని నానికి మధ్య తలెత్తిన విభేదాలు రచ్చకెక్కాయి.
జిల్లా మంత్రిగారికి చెబుతున్నా... మీరే అధికారులతో మాట్లాడుకుని, మీరే నిర్ణయాలు తీసుకుంటే కుదురద అని కేశినేని నాని ఉమా మహేశ్వర రావు సమక్షంలోనే వ్యాఖ్యానించారు. మరో మంత్రి నారాయణ వేదికపై ఉండగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానిపై తీవ్ర ఆగ్రహంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో చంద్రబాబును కలవాలని పార్టీ నాయకత్వం ఆయనను ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే, తనకు పార్టీ నుంచి ఏ విధమైన సమాచారం అందలేదని, తానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని నిర్ణయించుకున్నానని కేశినేని నాని అంటున్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో పాటు తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఆయన వివరించే అవకాశం ఉంది.