అమరావతి పిటిషన్లపై సుప్రీంలో కీలక విచారణ-విభజన చట్టంతో కలిపి- తీర్పుపై ఉత్కంఠ ?
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లతో పాటు రైతులు దాఖలు చేసిన పిటిషన్లు, అలాగే ఏపీ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ జరపబోతోంది.
ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో అమరావతినే రాజధానిగా సమర్దిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. దీన్ని అప్పట్లో సవాలు చేయని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో దీన్ని వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తర్వాత సెప్టెంబర్ లో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. ఏపీ విభజన చట్టంపై గతంలో దాఖలైన పిటిషన్లను కూడా దీంతో కలిపి విచారణ జరపాలని మరో కీలక నిర్ణయంతీసుకుంది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా అత్యవసర విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో విచారణను ఇవాళ్టికి వాయిదావేస్తూ గతంలో నిర్ణయంతీసుకుంది.
ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ అమరావతికి అనుకూల,వ్యతిరేక పిటిషన్లపై విచారణ నిర్వహించబోతోంది. ఇందులో పిటిషనర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రైతులు, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములవుతున్నారు. వీరంతా తమ వాదనలతో సిద్దమయ్యారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఇచ్చే ఆదేశాలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా మారిన నేపథ్యంలో అందరి కళ్లూ ఇప్పుడు తీర్పుపైనే ఉన్నాయి.