ఎవరికి చెప్పి వచ్చారు?: మాజీ మంత్రి మృణాళినికి చేదు అనుభవం
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అదే పార్టీకి చెందిన నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
విజయనగరం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి అదే పార్టీకి చెందిన నేతల నుంచి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని విజయాకాలనీలో మృణాళిని గురువారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.
అయితే, ఈ కార్యక్రమంపై స్థానిక టీడీపీ నేతలకు సమాచారం లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అమ్మా నేను ఈ వార్డు మెంబర్ని మా ప్రాంతంలో ఎవరికి చెప్పి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారు? స్థానిక ప్రజాప్రతినిధిని అయిన నాకు చెప్పక్కర్లేదని అనుకున్నారా? సమాధానం చెప్పండి?' అని సురేష్ నిలదీశారు.
తనకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే మృణాళిని సమాధానమిస్తూ.. తాము మండల పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇచ్చామని తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మృణాళినితోపాటు మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరలహాలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు పాల్గొన్నారు.