గంటలపాటు కిరణ్ సంతకాలు, రాజీనామాపై ఏంచేస్తారు?
హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విజ్ఞాపన పత్రాల పైన సంతకాలు చేయడానికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దాదాపు రెండు గంటలు పట్టింది. ఎమ్మెల్యేలు వరుస కట్టడంతో అసెంబ్లీలోని ఆయన కార్యాలయం బుధవారం కిక్కిరిసిపోయింది. కిరణ్ తన కార్యాలయంలోకి అడుగు పెట్టగానే వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి విజ్ఞాపనలు తీసుకు వచ్చారు. దీంతో సిఎం తన చేతులకు పని చెప్పారు.
శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయడంతో ముఖ్యమంత్రి బుధవారం రోజంగా బిజీగా మారిపోయారు. శాసనసభలోని తన ఛాంబర్లో దాదాపు ఐదు వందలకు పైగా ఫైళ్లు, దరఖాస్తులపై సంతకాలు చేసిన ఆయన క్యాంప్ కార్యాలయంలో కూడా సంతకాలతోనే రాత్రి వరకు గడిపారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బారులు తీరిమరీ ముఖ్యమంత్రితో వివిధ పనులకు సంబంధించిన దరఖాస్తులపై, వినతిపత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ముఖ్యమంత్రి కూడా ఎవరినీ కాదనకుండా సంతకాలు చేయడంతో ఆయన కార్యాలయం సంతకాల జాతరగా మారిపోయింది.
పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లు పార్లమెంటులో పెట్టిన వెంటనే కిరణ్ రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేయించుకునేందుకు అందరు పోటీ పడ్డారు. కిరణ్ కూడా బుధవారం అడిగిన ప్రజాప్రతినిధులకు కాదనకుండా ప్రాంతాలకు అతీతంగా ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయల పనులు, నిధుల మంజూరు చేశారు.
కిరణ్ ఏం చేస్తారు?
మరోవైపు, రాజీనామా విషయంలో కిరణ్ ఏం చేస్తారనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తెలంగాణ బిల్లును గురువారం లోకసభలో పెడితే ఆయన రాజీనామా చేస్తానని చెప్పారని ప్రచారం జరిగింది. అయితే పార్లమెంటుకు బిల్లు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కిరణ్ గురువారం రాజీనామా చేయక పోవచ్చు. అయితే, ఆయన ముందు ముందు ఏం చేస్తారనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కిరణ్ ఎమ్మెల్యేలు, సీమాంధ్ర రాష్ట్ర మంత్రులతో పాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులతోను రాజీనామాల అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది.