కిరణ్ వద్ద ఆఖరి అస్త్రం ఉందా: అవిశ్వాసం వెనుకా..?
హైదరాబాద్: రాష్ట్రానికి తెలంగాణ బిల్లు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఆఖరి ఆస్త్రం ఉందా? ఉంటే అదేమిటనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన సభలో రాజీనామా చేస్తారనే ప్రచారం కొద్ది రోజుల క్రితం జరిగింది. తాజాగా బిల్లును అడ్డుకునేందుకు ఇంకా అస్త్రాలు ఉన్నాయా అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అసెంబ్లీ బిల్లుకు రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చినందున మరికొంత సమయం కోరే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
విభజన ఆపేందుకు చివరి బంతి ఉందంటూ చెప్పుకొస్తున్న ముఖ్యమంత్రి వ్యూహం ఆయన వర్గీయులకే అర్థం కావడం లేదట. అయితే ఇటీవల సంభవిస్తున్న కొన్ని పరిణామాలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నట్టు భావిస్తున్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా దిగ్విజయ్ రావడం, భిన్నప్రాంతాల నేతలతో చేస్తున్న మంతనాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయంట.

ఇటీవల సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు, ఎంపీలు సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసం ప్రవేశపెట్టడం సంచలనమే సృష్టించింది. ఈ అవిశ్వాస తీర్మానం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉండొచ్చన్న ప్రచారం పార్టీలో ప్రారంభమైంది. అందుకే ఇది కిరణ్ సంధించిన ఒక అస్త్రంగా కూడా భావిస్తున్నారు.
తమ స్టార్ బ్యాట్స్మన్ కిరణ్ అని ఎప్పుడూ చెప్పుకునే లగడపాటి రాజగోపాల్ కూడా అవిశ్వాసంపై సంతకం చేసిన వారిలో ఉండటం, ఆయన కదలికలు ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండవన్న భావన కూడా అది ముఖ్యమంత్రి సంధించిన అస్త్రంగానే చెప్పుకుంటున్నారు.
ఇక బిల్లుపై చర్చపైనా కొత్త ప్రచారం మొదలైంది. ఆర్టికల్ 3 ప్రకారం బిల్లుపై ఓటింగ్ ఉండదు, కేవలం చర్చ మాత్రమే ఉంటుంది. అయితే కిరణ్ మాత్రం ఓటింగ్లో బిల్లును ఓడిస్తామని పదేపదే చెబుతున్నారు. దీంతో ఇదెలా సాధ్యమన్న ప్రశ్న ఉదయిస్తోంది. కాగా, ఓటింగ్కు అవకాశం లేని పరిస్థితుల్లో ఏం చేయాలన్న అంశంపై సిఎం వర్గం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. సభలో ఉన్న మొత్తం సభ్యులు అందరితో బిల్లుపై మాట్లాడించడం ద్వారా ఎంతమంది అనుకూలంగా ఉన్నారు, ఎంతమంది బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారన్నది స్పష్టమవుతుందని, ఈ వివరాలను కేంద్రానికి పంపించడం ద్వారా అన్యాపదేశంగా ఓటింగ్ తరహా ఫలితాలను అందించేందుకు ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం.
అందుకే శాసనసభాపక్ష నేతగా అందరితో మాట్లాడించేందుకు ఆయన శాసనసభా వ్యవహరాల సమావేశంలో పట్టుబట్టే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. మాకు తెలంగాణ కావాలని, దీనిపై ఎన్నిరోజులు చర్చించినా, ఎంతమంది మాట్లాడినా అభ్యంతరం లేదని తెలంగాణవాదులు కూడా చెబుతున్న నేపథ్యంలో అందరితో మాట్లాడించే విధానాన్ని డిమాండ్ చేయాలని ముఖ్యమంత్రి వర్గీయులు అంటున్నారు.
అయితే దిగ్విజయ్సింగ్ అకస్మాత్తుగా నగరానికి రావడం, ఆయన రెండు ప్రాంతాలకు చెందిన నేతలతో విస్తృతంగా చర్చించడం వెనుక కారణాలపై ముఖ్యమంత్రి వర్గీయులు ఆరా తీస్తున్నారు. తెలంగాణకు చెందిన వారు పూర్తిగా బిల్లుకు అనుకూలంగానే ఉంటారు. అయితే సీమాంధ్రకు చెందినవారిలో కొంతమందిని విభజనకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తే బిల్లుకు అడ్డంకులు ఉండవని, అందుకే ఆ దిశగా పావులు కదపేందుకే దిగ్విజయ్ నగరానికి వచ్చి ఉంటారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఈ కొత్త పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అస్త్రాలు, ముందడుగు ఎలా ఉంటాయన్నది మాత్రం సస్పెన్స్గా మారాయి.












Click it and Unblock the Notifications