కిరణ్ తన కోసం కాదన్నారు: కొత్త పార్టీపై టిజి, పోరాటమే
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ విషయమై తమతో చర్చించారని, వారం రోజుల్లో అభిప్రాయాలు చెబుతామని చెప్పామని మాజీ చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ బుధవారం అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తన నివాసంలో మాజీ మంత్రులు, పలువురు నేతలతో మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పార్టీ అంశం చర్చకు వచ్చింది. ఈ నెల 23వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుందామని కిరణ్ వారికి సూచించారు.
భేటీ అనంతరం టిజి వెంకటేష్ విలేకరులతో మాట్లాడారు. విభజన నిర్ణయం తమకు పెద్ద షాకింగ్ న్యూస్ అన్నారు. తాము కిరణ్తో భేటీ అయినప్పుడు కొత్త పార్టీ అంశం చర్చకు వచ్చిందన్నారు. తన కోసం ఏమీ అవసరం లేదని, సీమాంధ్ర ప్రజలకు అవసరమైతే చెప్పాలని తమను కోరారన్నారు. తాము వారం రోజుల్లో చెబుతామని ఆయనకు తెలిపామన్నారు.
తాము గతంలో చెప్పినట్లుగా కాంగ్రెసు పార్టీకి, పదవులకు రాజీనామా చేశామన్నారు. తాము విభజనలో వెనుకబడ్డామన్నారు. కిరణ్ ఆరునెలల క్రితమే రాజీనామా చేస్తే బాగుండేదన్న బొత్స, చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ పార్టీ స్థాపించినప్పుడే తాము మేల్కొని ఉంటే విభజన జరిగేదే కాదన్నారు.
ఎన్నికల ముందు విభజన జరుగుతుందని తాను క్లారిటీగా చెప్పానని గుర్తు చేశారు. విభజన విషయంలో తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, ఈ నెల 22, 23 తేదీల్లో ముఖ్యమంత్రి నేతలతో మరోసారి భేటీ కానున్నారు. ఆ తర్వాత సీమాంధ్ర ప్రాంత జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సమయంలో ఆయన కొత్త పార్టీపై ప్రకటన చేసే అవకాశముంది.