భారత్ పై బుసలు కొడుతున్న పాకిస్థాన్ 'నయా అస్త్రం'.. చైనా సపోర్ట్ తో భారీ స్కెచ్..!
భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ముప్పు పొంచి ఉంటూనే ఉంది. ఇప్పటికే దశాబ్దాలుగా అటు పాకిస్థాన్, ఇటు చైనాతో భారత్ అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటోంది. అయినా ఏనాడు ఆ శత్రు దేశాలకు తలవంచకుండా ఆ దేశాల కుయుక్తులను, కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఆసియా ఖండంలోనే అగ్ర శక్తిగా భారత్ అవతరిస్తోంది. ఇక గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే ఈ యుద్ధ సమయంలో చైనా, టర్కీ అందించిన డ్రోన్ లు, క్షిపణులను భారత్ పై ప్రయోగించింది పాకిస్థాన్.. కానీ వాటిని భారత్ కు చెందిన ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నేలకూల్చింది.
ఇక పాకిస్థాన్ ప్రతి విషయంలోనూ చైనాపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. చైనా అందిస్తున్న టెక్నాలజీ, ఢిఫెన్స్ సాయంతో భారత్ పై కుట్రలు పన్నుతోంది పాకిస్థాన్. ఇప్పటివరకూ పాకిస్థాన్ కు చైనానే అత్యధిక ఆయుధాలు సరఫరా చేసిన దేశంగా నిలుస్తూ వస్తోంది. పాకిస్థాన్ వద్ద ఉన్న ఆయుధాల్లో దాదాపు 82 శాతం చైనా సరఫరా చేసినవే కావడం గమనార్హం. అయితే గత ఐదేళ్లలో వీటి సరఫరా మరింత పెరిగినట్లు భారత నిఘా వర్గాలు తేల్చేస్తున్నాయి. దీంతో మేడ్ ఇన్ చైనా ఆయుధాలతో పాకిస్థాన్.. భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే తాజాగా చైనా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన హంగోర్ జలాంతర్గామి పాకిస్థాన్ కు చేరుకుంది. ఈ మేరకు తాజాగా హంగోర్ జలాంతర్గామి పాకిస్థాన్ లోని కరాచీ తీరానికి చేరింది. ఇలాంటివి మొత్తం 8 జలాంతర్గాములను కొనుగోలు చేసేందుకు చైనాతో పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వీటిలో నాలుగింటిని చైనా నిర్మిస్తుండగా మరో నాలుగింటిని టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కింద పాకిస్థాన్ లోని కరాచీ షిప్ యార్డ్ లోనే నిర్మిస్తున్నారు. ఇక 2028-30 నాటికి ఈ ఎనిమిది జలాంతర్గాములు పాకిస్థాన్ కు అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం అవుతోంది.

హంగోర్ జలాంతర్గామికి చాలా శక్తి సామర్థ్యాలే ఉన్నాయి. ఇవి ప్రత్యర్థి కంటపడకుండా దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఒక్కోటి దాదాపు 2,500 నుంచి 2,800 టన్నుల బరువు ఉంటాయి. ఇవి సముద్రంలో గంటకు 35 కి. మీ. వేగానికి పైగా ప్రయాణిస్తాయి. ఈ జలాంతర్గామి గరిష్ఠంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. ఒక్కో జలాంతర్గామిలో గరిష్ఠంగా 38 మంది సిబ్బంది, 8 మంది స్పెషల్ ఫోర్స్ కమాండోలు ప్రయాణించవచ్చు. తాజాగా వీటి సరఫరాతో భారత్ అప్రమత్తమైంది. పాకిస్థాన్ కదలికల్ని క్షుణ్ణంగా గమనిస్తోంది.
ఇక ఇప్పటికే చైనా నుంచి జేఎఫ్ 17 థండర్ ఫైటర్ జెట్లు, జే 10 సీఈ ఫైటర్ జెట్లు, టైప్ 05 ఏ ఫ్రిగేట్స్, టైప్ 041 హాంగర్ క్లాస్ సబ్ మెరైన్స్, వింగ్ లూంగ్ 2 డ్రోన్స్ , జెడ్ 10ఎమ్ ఈ ఎటాక్ హెలికాప్టర్స్, హెచ్ క్యూ 9 డిఫెన్స్ సిస్టమ్స్, ఎస్ హెచ్ 15 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, పీఎల్ 15 మిసైల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలను పాకిస్థాన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications