కిరణ్ రాజీనామా ఖాయం: పితాని, ఉల్లంఘనే: పొన్నాల
హైదరాబాద్/ న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అయితే, ఎప్పుడు రాజీనామా చేయాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.
ఆరుగురు పార్లమెంటు సభ్యులపై బహిష్కరణ వేటు వేయడం బాధాకరమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులపై వేటు కాంగ్రెసు పార్టీకి తీరని నష్టమని, కానీ సమైక్యవాదం వినిపించడానికి వారికి మంచి అవకాశం లభించిందని ఆయన అన్నారు.
ఆరుగురు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులపై బహిష్కరణ వేటు వేయడాన్ని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య సమర్థించారు. ఆరుగురు ఎంపీలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అది క్రమశిక్షణ ఉల్లంఘనే అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర ఎంపీలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.
తాము ఎన్ని అవమానాలు ఎదురైనా క్రమశిక్షణను ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు. తమకు అవమానాలు, వివక్ష ఎదురయ్యాయని, అయినా తాము పార్టీ విధానాలకు కట్టుబడి వ్యవహరించామని ఆయన అన్నారు. పూవులు, రాళ్లు పడినా పార్టీకి అనుగుణంగానే ఉన్నామని ఆయన అన్నారు.
జయప్రకాష్ నారాయణపై జరిగిన దాడి బాధాకరమని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తాము వ్యక్తులను వ్యతిరేకించడం లేదని, వాదనలను వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా సాగిందని ఆయన అన్నారు.