మజ్లీస్తో దోస్తీయా: కెసిఆర్పై కిషన్ రెడ్డి మండిపాటు
హైదరాబాద్: మజ్లీస్ పార్టీతో కలిసి పనిచేయాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్ణయాన్ని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తప్పు పట్టారు. మజ్లీస్తో కలిసి పనిచేయాలనే నిర్ణయంపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మజ్లీస్ నేతల వద్దకు తెరాస నేతలు వెళ్లి సలాం కొట్టారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెరాస, మజ్లీస్ కలయిక అసహజమైందని, అవకాశవాద రాజకీయమని ఆయన అన్నారు. మజ్లీస్ సంఘ విద్రోహులతో కూడిన పార్టీ అని ఆయన అభివర్ణించారు. మజ్లీస్తో తెరాస చేతులు కలపడం వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు.

మజ్లీస్తో స్నేహం చేసే ముందు మజ్లీస్ పూర్వచరిత్రను గమనించాలని ఆయన సూచించారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో మజ్లీస్ నేతలు పదే పదే చిచ్చు పెట్టారని, పోలీసులపై దాడులు చేశారని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రశాంత వాతావరణాన్ని మజ్లీస్ నేతలు భగ్నం చేశారని ఆయన ఆరోపించారు
తెలంగాణను వ్యతిరేకించిన మజ్లీస్తో స్నేహం ఎలా చేస్తారని ఆయన అడిగారు. భారతదేశంపై మజ్లీస్ నేతలు యుద్ధం ప్రకటించిన విషయం నిజం కాదా, ఈ విషయమై వారి మీద కేసులున్న విషయం నిజం కాదా అని ఆయన అడిగారు. భూకబ్జాలు చేయడం, దౌర్జన్యం, గుండాయిజం మజ్లీస్ నైజమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications