'జన్ధన్'పై కిషన్, స్నేక్ గ్యాంగ్ వెనుక మజ్లిస్ హస్తం
హైదరాబాద్: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అద్భుతమైనదని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గురువారం అన్నారు. ఈ పథకంలో భాగంగా ఖాతా ప్రారంభించిన వారికి ఆరు నెలల అనంతరం ఖాతా నుండి రూ.5వేలు రుణం పొందవచ్చునని తెలిపారు. రూ.5వేలు రుణం తీర్చిన అనంతరం రూ.15వేలు రుణం లభిస్తుందని చెప్పారు. రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఉంటుందని చెప్పారు. బ్యాంకు అధికారులకు బీజేపీ కార్యకర్తలు సహకరించి పథకం విజయం అయ్యే విధంగా కృషి చేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎందరో యువతుల జీవితాలతో ఆడుకుని, సెటిల్మెంట్ల పేరిట ఎందరో అమాయకుల కలలను ఛిద్రం చేసి, కాబోయే భర్త కళ్ల ముందే యువతిని సామూహిక అత్యాచారం చేసిన స్నేక్ గ్యాంగ్ సభ్యులకు బతికే హక్కు లేదని కిషన్ రెడ్డి అన్నారు. స్నేక్ గ్యాంగ్ ఆగడాల వెనుక మజ్లిస్ హస్తం ఉందన్నారు. మజ్లిస్ అండ చూసుకునే వారీ దారుణాలకు తెరతీశారని ఆరోపించారు. జగ్గారెడ్డి తెలంగాణవాది అన్న సంగతి అందరికీ తెలిసిందేనని, నేతల తీరును ఆయన వ్యతిరేకించారే తప్ప వాదాన్ని ఏనాడూ వదల్లేదన్నారు.
స్నేక్ గ్యాంగ్ పైన బీజేపీ ఆగ్రహం
ఓల్డ్ సిటీలో స్నేక్ గ్యాంగ్ ఉదంతం పైన సీబీఐ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. స్నేక్ గ్యాంగ్ ఆగడాలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.
బీజేపీ నగర అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీ అండదండలతోనే స్నేక్ గ్యాంగ్ ఆకృత్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మజ్లిస్కు రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్న కారణంగా ఈ దారుణాల పైన సీబీఐ విచారణ అనివార్యమన్నారు. స్థానిక పోలీసులు అధికారులు, సిబ్బంది మొత్తాన్ని బదలీ చేయాలని లేదంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందన్నారు.