జగన్, చంద్రబాబులను ఓడించండి: కోదండరామ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, తెలుగుదేశం పార్టీని ఓడించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ రాజకీయ జెఎసి శుక్రవారం రాజకీయ తీర్మానం చేసింది. తీర్మానం వివరాలను టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వారెవరో, అడ్డుపడిన వారెవరో, రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న చైతన్య వంతులైన తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసునని ఆయన అన్నారు.
రానున్న ఎన్నికల్లో తాము నిర్వహించాల్సిన పాత్రపై ప్రజలకు స్పష్టత ఉంది, ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ విజ్ఞత ప్రదర్శిస్తారనే నమ్మకం ఉందని కూడా అన్నారు. చివరి క్షణం వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్, టిడిపి పార్టీలను ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని , ఈ రెండు పార్టీలను పూర్తిగా ఓడించాలని మాత్రమే తెలంగాణ జెఎసి తెలంగాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నదని రాజకీయ తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించడానికి టిజెఎసి వరుసగా మూడు సార్లు సమావేశం నిర్వహించింది. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికి పోషించిన పలు రాజకీయ పక్షాలు ఒక పార్టీపై మరో పార్టీ పోటీ పడుతున్నందున ఏదో ఒక పార్టీకి మద్దతు ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. టిజెఎసిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి, న్యూ డెమోక్రసీ పార్టీలు పని చేశాయి. సిపిఐ టిజెఎసిలో లేకపోయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది.
ఇలాంటి పరిస్థితిలో ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం కన్నా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్లకు ఓటు వేయవద్దని కోరడమే బాగుంటుందని పలు సంఘాల నాయకులు సూచించడంతో ఈ మేరకు శుక్రవారం రాజకీయ తీర్మానం చేశారు.