కోడెల ఏకగ్రీవం, ఆలోచించలేదని జగన్, ఆ భావన వద్దు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా కోడెల శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సమావేశాలు ప్రారంభమైన అనంతరం గురువారం సభకు హాజరు కానీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం స్పీకర్గా కోడెల ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు మాట్లాడారు.
కోడెలను చంద్రబాబు అభినందించారు. కోడెలకు ఏ పని అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఎంతోమంది స్పీకర్లుగా వచ్చారని కానీ, కొంతమందే చరిత్రలో మిగిలిపోయారన్నారు. కోడెల కూడా సభను అద్భుతంగా నడిపి చరిత్రలో మిగిలిపోవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏ పదవి ఇచ్చినా ఆయన వన్నె తెచ్చారన్నారు. అధికారం లేకపోయినా చిత్తశుద్ధితో పని చేస్తారన్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి కోడెల చేసిన కృషి మరువలేనిదన్నారు. రైతుల కోసం కూడా కృషి చేశారన్నారు. కోడెలది ఎవరికీ అన్యాయం చేసే మనస్తత్వం కాదన్నారు. 1983 నుండి కోడెలతో తనకు పరిచయం ఉందని చెప్పారు. సిన్సియారిటీకి, సినియారిటీకి కోడెల మారుపేరు అని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. సిద్ధాంతాలకు ఆయన విలువ ఇస్తారన్నారు.
జగన్ మాట్లాడుతూ... నిన్న సాయంత్రం యనమల రామకృష్ణుడు తన వద్దకు వచ్చి స్పీకర్గా కోడెలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించాలని కోరగా, తాను క్షణం ఆలోచించకుండా సంతకం చేశానని చెప్పారు. కోడెల అపార అనుభవమున్న వ్యక్తి అన్నారు.
మీ మనసులో అధికార పార్టీ సభ్యుడిని అనే భావన రావొద్దని జగన్ సూచించారు. మీ పేరు చెప్పగానే తాను మద్దతిచ్చానన్నారు. మిమ్మల్ని అధికార పార్టీ సభ్యుడిగానే కాకుండా మా పార్టీ సభ్యుడిగాను భావిస్తానని చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు రెండు చక్రాలు అయితే స్పీకర్ ఇరుసు వంటి వారన్నారు. మీకు అధికార పార్టీ అనే భావన రావొద్దన్నారు.