మాట్లాడేందుకు జగన్ అవకాశమివ్వడం లేదు: స్పీకర్, ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానిస్తామని ఆంధ్రప్రదేశ్ శఆసన సభాపి కోడెల శివప్రసాద్ రావు మంగళవారం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కోరుతున్నానని, ఈ విషయమై జగన్తో మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు.

జగన్ తనకు అవకాశమివ్వడం లేదు
కానీ మాట్లాడేందుకు జగన్ తనకు అవకాశం ఇవ్వడం లేదని కోడెల చెప్పారు. ప్రతిపక్షం లేదనే అసంతృప్తి స్పీకర్గా తనకు ఉంటుందని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదో తనకు తెలియదని చెప్పారు. ఇరుపక్షాలు ఉంటే స్పీకర్కు సవాల్గా ఉంటుందని చెప్పారు.

పార్టీ ఫిరాయింపుల అనర్హతపై
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని కోడెల తెలిపారు. అయితే, అసెంబ్లీకి రాకుండా అలవెన్సులు పొందడం నైతికతకు సంబంధించిన విషయమని చెప్పారు. ఫిబ్రవరి 5వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. 6, 7, 8 తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుందన్నారు. అలాంటప్పుడు నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సభ నిర్వహించే సమయంలో తాను నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తానని చెప్పారు.

అది రాజ్యాంగ విరుద్ధం
కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్కు బదులు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశమున్నట్లుగా సమాచారం ఉందని కోడెల తెలిపారు. అలా చేయడం పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టదని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications