వలసలు షురూ: బిజెపిలోకి కొమ్మూరి, పొన్నాలతో రె'డీ'
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆదివారం ఆ పార్టీ కార్యాలయంతా చేరికలతో నిండిపోయింది. వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి ఆదివారం తన అనుచరులతో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొమ్మూరి 2009 ఎన్నికల్లో జనగామ నియోజక వర్గం నుంచి మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన వైయస్సార్ కాంగ్రెస్లో పార్టీలో చేరినా, ఆ పార్టీ యూ టర్న్ తీసుకోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు బిజెపిలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో భాగంగా బిజెపిలోకి వచ్చిన కొమ్మూరిని జనగామ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కొమ్మూరి రాకతో రానున్న ఎన్నికల్లో జనగామతో పాటు జిల్లావ్యాప్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొమ్మూరి మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరికైన తెలంగాణ ఏర్పాటు బిజెపి మద్దతుతోనే సాధ్యమవుతోందని తెలిపారు.
తెలంగాణకు అండగా నిలిచిన పార్టీని బలోపేతం చేయాలనే తాను బిజెపిలో చేరుతున్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ జిల్లాలో మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వరంగల్ జిల్లా ములుగుకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఉషాకిరణ్, నగరానికి చెందిన పలువురు కూడా వందల మంది అనుచరులతో పార్టీలో చేరారు.
కాగా, శాసన సభకు రాష్ట్రపతి పంపిన సందేశంపై సభ్యులు కూలంకషంగా చర్చించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యులకు బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు వేరుగా సూచించారు. తెలంగాణ విషయంలో బిజెపి వైఖరిలో ఎటువంటి మార్పూ లేదన్నారు.