కొణతాలకు ఎదురుగాలి: టిడిపిలో చేరిక వాయిదా
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ నేత కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరే విషయం వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో అది వాయిదా పడినట్లు చెబుతున్నారు. ఆయన ఇది వరకే టిడిపిలో చేరాల్సి ఉండింది. కానీ అది ఈ నెల 26వ తేదీకి వాయిదా పడినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను తెలుగుదేశంలో చేర్చుకోవద్దంటూ అనకాపల్లిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేశారు. పూడిమడక రోడ్డు జంక్షన్లో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు.
ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడారు. కొణతాలను టీడీపీలో చేర్చుకుంటే కార్యకర్తల్లో అభద్రతాభావం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పీలా గోవింద నేతృత్వంలో అనకాపల్లి నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, దీంతో పార్టీ మరింత బలపడుతున్నదని అన్నారు. ఇటువంటి సమయంలో కొణతాల అవసరం టీడీపీకి లేదని ఆయన అన్నారు.
టీడీపీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు కూడా కొణతాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆది నుంచీ తెలుగుదేశం పార్టీ అంటే కొణతాలకు గిట్టదని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవద్దని కోరారు. అనకాపల్లిలో టీడీపీ పటిష్టంగా వుందని, అందరం ఐకమత్యంతో పనిచేస్తున్నామని, ఇటువంటి సమయంలో కొణతాలను తీసుకోవద్దని డాక్టర్ కేకేవీఏ నారాయణరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బీఎస్ఎంకే జోగినాయుడు, మలసాల రమణరావు, మలసాల ధనమ్మ, గుత్తా ప్రభాకర చౌదరి, బొలిశెట్టి శ్రీనివాసరావు, వేగి గోపీకృష్ణ, పొలిమేర నాయుడు, అక్కిరెడ్డి రమణబాబు, కుప్పిలి జగన్మోహనరావు, మళ్ల శ్రీరాములు, బోడి వెంకటరావు, పెంటకోట రాము, సిరసపల్లి సన్యాసిరావు, పిట్ల రాజు, భరణికాన శ్రీనివాసరావు, కోట్ని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు,
అయితే, కొణతాల రామకృష్ణ టిడిపిలో చేరికకు ముహూర్తం ఖరారైనట్టే. ఆయన మంగళవారం టిడిపిలో చేరాల్సి ఉండగా, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల కార్యకర్తల నుంచి వచ్చిన వ్యతిరేకతకు తలొగ్గి అధిష్టానం కొణతాల చేరికను తాత్కాలికంగా వాయిదా వేసిందన్న వార్తలు వెలువడ్డాయి. కొణతాలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి అయ్యన్నపాత్రునికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత కొణతాల బిజెపిలో చేరాల్సి ఉంది. గడచిన ఎన్నికల తరువాత బిజెపిని తన సొంత కాళ్ళపై నిలబెట్టేందుకు అథిష్ఠానం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకునిగా ఉన్న కొణతాలను తమ పార్టీలోకి తీసుకురావాలని బిజెపి తీవ్రంగా ప్రయత్నించింది. జిల్లాలో బిజెపి బలీయమైన శక్తిగా ఎదిగితే, టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించిన చంద్రబాబు నాయుడు కొణతాలను టిడిపిలో తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
టిడిపి నుంచి అనుకోని పరిస్థితుల్లో బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు కూడా తిరిగి టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు సాగించారు. కానీ, చంద్రబాబు నాయుడు కొణతాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి అయ్యన్నపాత్రుడు నెరపిన మంతనాలతో కొణతాల టిడిపిలోకి వస్తున్నారు. వచ్చిన వెంటనే ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వకపోవచ్చు.
భవిష్యత్లో పార్టీకి ఉపయోగపడతారన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీలోకి తీసుకుంటున్నారు. ఈనెల 26న కొణతాల పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అప్పుడు సాధ్యం కాకపోతే, ఈవారంతంలో చేరిక జరుగుతుందని, ఎవ్వరు అడ్డుకున్నా, కొణతామల చేరిక ఆగదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.