సూర్య ‘కరుప్పు’ సినిమా కేసు: మద్రాస్ హైకోర్టు షాకింగ్ కామెంట్స్!
మద్రాస్ హైకోర్టులో సినీ రంగానికి, న్యాయవ్యవస్థకు సంబంధించిన ఓ కేసు చర్చకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా 'కరుప్పు'పై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాస్ హైకోర్డు గురువారం నిరభ్యంతరంగా తిరస్కరించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
సినిమాపై నిషేధానికి హైకోర్టు నో
ఇటీవల థియేటర్లలో విడుదలైన 'కరుప్పు' సినిమాలో న్యాయవ్యవస్థను, జడ్జీలను తప్పుగా చూపించారంటూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ జి.ఆర్.స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. చిత్ర నిర్మాతలు, దర్శకులకు తమ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, అందువల్ల తాము ఈ సినిమాలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సినిమాపై నిషేధం విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

'కొందరు జడ్జీలు అవినీతిపరులే'.. కోర్టు షాకింగ్ కామెంట్స్
సినిమాలో న్యాయమూర్తులను తప్పుడు మార్గంలో చూపించారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది పదే పదే వాదించగా.. హైకోర్టు ధర్మాసనం లాయర్లకే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. "అది దర్శకుడు, నిర్మాతల వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, దానికి మేమేం చేయగలం? నిజ జీవితంలో లంచాలు తీసుకునే లాయర్లు ఉన్నారు.. అలాగే కొందరు అవినీతిపరులైన జడ్జీలు కూడా ఉన్నారు. సినిమాలో ఆ విషయాన్ని కాస్త పతాక స్థాయిలో చూపించి ఉండవచ్చు" అంటూ న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పిటిషనర్ అభ్యంతరం ఏమిటంటే?
న్యాయవాది ఆర్ఎస్ తమిళవేందన్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో 'కరుప్పు' సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఒక జడ్జీ పాత్రను లంచాలు తీసుకునే వ్యక్తిగా, డ్రగ్స్ అలవాటు ఉన్నవాడిగా చూపించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి సినిమాలను థియేటర్లలో, ఓటీటీలలో ప్రదర్శిస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పూర్తిగా సడలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు హోంశాఖ, సమాచార శాఖలతో పాటు సెన్సార్ బోర్డు ఈ సినిమాపై తక్షణమే నిషేధం విధించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
బాక్సాఫీస్ వద్ద 'కరుప్పు' కలెక్షన్ల సునామీ
మరోవైపు వివాదాలు ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద సూర్య, త్రిషల 'కరుప్పు' సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ఏడో రోజున కూడా ఈ యాక్షన్ డ్రామా దేశవ్యాప్తంగా ఘనమైన వసూళ్లను సాధించింది. కేవలం 7వ రోజే ఈ చిత్రం భారత్లో రూ. 8.30 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పటివరకు భారతదేశంలోనే ఈ సినిమా రూ. 132.05 కోట్ల మార్కును దాటింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏడు రోజుల్లోనే రూ. 189.05 కోట్ల గ్రాస్ వసూలు చేసి రూ. 200 కోట్ల క్లబ్కు చేరువలో ఉంది.
కోర్టు రూమ్ డ్రామాగా 'కరుప్పు' కథ
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుప్పు' సినిమా ఓ వినోదాత్మక కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సూర్య 'శరవణన్' అనే పవర్ఫుల్ లాయర్ పాత్రలో నటించారు. స్థానిక దైవం 'కరుప్పుస్వామి' మానవ రూపంలో వచ్చి అన్యాయాన్ని ఎలా ఎదిరించాడు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా కథ నడుస్తుంది. సూర్య నటన, డైలాగులకు ప్రేక్షకుల నుండి థియేటర్లలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది.












Click it and Unblock the Notifications