‘మోడీ ఏపీ గుండెల్లో పొడిస్తే.. బాబు వెన్నుపోటు పొడిచారు’
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ గుండెలపై పొడిస్తే, సీఎం చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే మరోసారి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం మీడియాపాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదాపై రెండేళ్లు ఎదురుచూసేలా చేసిన కేంద్రం.. ఏపీని మోసం చేసిందన్నారు. ఇంత జరిగినా చంద్రబాబు నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదని, ప్రత్యేక హోదాపై చర్చ జరగాలా? వద్ద అనే విషయంపై చంద్రబాబు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ప్రతిఒక్కరూ ప్రత్యేకహోదా కోరుకుంటున్నారని, హోదా విషయమై కేంద్రం తెగేసి చెప్పినా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని రెండు నెలల నుంచే కేంద్రం చెబుతోందని, ఈ ప్రకటనలు వింటుంటే తన రక్తం మరుగుతోందని నాడు చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు ఆయన రక్తం మరగట్లేదా? అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రత్యేక హోదా ఇకపై కూడా కొనసాగిస్తామని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
మహోన్నత ప్యాకేజీ: హరిబాబు
కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తాననడంపై విశాఖ ఎంపీ, భారతీయ జనతా పార్టీ నేత హరిబాబు స్వాగతించారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక బలం పెరిగేలా అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ మహోన్నతమైనదని వ్యాఖ్యానించారు.
గురువారం మధ్యాహ్నం ఓ టీవీ ఛానల్తో హరిబాబు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ తరహా ప్యాకేజీ ఎన్నడూ రాలేదని చెప్పుకొచ్చారు. విజయవాడకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వే జోన్ రాదని, విశాఖకే వస్తుందని అన్నారు.
విజయవాడకు జోన్ రానుందని బుధవారం జరిగిన ప్రచారం పూర్తి అవాస్తవమని, అసలా ఉద్దేశమే కేంద్రానికి లేదని తెలిపారు. చరిత్రాత్మకమైన ప్యాకేజీని ఏపీకి ప్రకటించిన ఆర్థిక మంత్రి జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే నిధులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని హరిబాబు అన్నారు.