అప్పుడే బాబుపై విమర్శలా: జగన్ పార్టీపై ఎంపి గీత

విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర రైల్వే సమస్యలపై పార్లమెంటు సభ్యుల సమావేశం జరగింది. వచ్చే నెల 2వ తేదీన రైల్వే అధికారులతో సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడారు. శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజా సమస్యలపై పోరాడితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అవసరమైతే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. తాను ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. అయితే, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానని అన్నారు.
తనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తున్న విమర్శలు సరి కాదని గీత అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను పాల్పడటం లేదని గీత అన్నారు. వైసీపీకి దూరంగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నాని తెలిపారు. అందరినీ కలుపుకుపోవడమే పార్టీ వ్యతిరేకమని భావిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. పార్టీలో చిల్లర రాజకీయాలు వద్దని హితవుపలికారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని సూచించారు. బాక్సైట్ తవ్వకాల్లో సీఎం చంద్రబాబు గిరిజనులకు అన్యాయం చేయరని భావిస్తున్నానని ఎంపీ గీత తెలిపారు.
గత కొంత కాలంగా కొత్తపల్లి గీత వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో మహిళలకు గౌరవం లేదని ఆమె విమర్శించారు. తనను పిలిస్తే పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతానని, తనంత తానుగా వెళ్లే ప్రసక్తి లేదని ఆమె ఇటీవల అన్నారు.












Click it and Unblock the Notifications