గవర్నర్ ముచ్చట తీరకుండానే : బీజేపీ కలిసొచ్చిన కృష్ణంరాజు - ప్రధానికి దగ్గరగా..!!
ఉప్పలపాటి కృష్ణంరాజు. రెబల్ స్టార్ గా సినీ పరిశ్రమలో రారాజుగా నిలిచారు. రాజకీయ రంగంలోనూ తన దైన ముద్ర వేసారు. కృష్ణంరాజు 1991లో కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. 1991లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు.తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీ నుంచి ఆహ్వానం అందటంతో ఆయన కమలం పార్టీలోకి చేరటం..రాజకీయంగా కలిసి వచ్చింది.
కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ
1998లో కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ అధిక్యంతో గెలుపొందారు. కాకినాడ ఏంపీగా ఏడాది మాత్రమే ఆయన పనిచేశారు. ఇక 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఏంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై 1,65,948 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. సొంత జిల్లా కావడంతో కృష్ణం రాజు భారీ మెజార్టీ సాధించారు.
ఇక రెండో సారి ఏంపీగా గెలవడంతో ఆయనను కేంద్రమంత్రి పదవి వరించింది. 2000 నుంచి 2004 వరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 200 సెప్టెంబర్ 30 నుంచి 2001 జులై 22వరకు సేవలందించారు.
కేంద్ర మంత్రిగా.. ప్రజారాజ్యం అభ్యర్ధిగా
ఆతర్వాత 2001 జులై నుంచి 2002 జులై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2002 జులై1 నుంచి వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2004లో తిరిగి నరసాపురం లోక్ సభ నుంచి ఏంపీగా పోటీచేసి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన చేగొండి వెంకట హరిరామ జోగయ్య చేతిలో ఓటమి చెందారు.
ఆతర్వాత కొంత కాలం రాజకీయాలకు అంటిముట్టనట్టుగా ఉన్న ఆయన.. 2009 మార్చిలో అప్పట్లో సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడంతో తిరిగి ఆయన 2013లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాధ్ సింగ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు.
గవర్నర్ పదవి దక్కుుందంటూ
2019 ఎన్నికల తరువాత ప్రధానిగా మోదీ రెండో సారి పగ్గాలు చేపట్టిన సమయం నుంచీ.. కృష్ణంరాజు గవర్నర్ గా నియమిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణంరాజు ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధాని వారితో సన్నిహితంగా వ్యవహరించారు.
కానీ, కృష్ణంరాజు కు గవర్నర్ పదవి మాత్రం దక్కలేదు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న కృష్ణంరాజు కొద్ది కాలంగా ఆస్పత్రిలోనే ఉన్నారు. వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్న సమయంలోనే..ఆయనకు ఈ తెల్లవారు జామున గుండె పోటు రావటంతో కన్నుమూసారు. పార్టీలకు అతీతంగా కృష్ణంరాజు మరణం పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పలు పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. రేపు కృష్ణంరాజు అంత్యక్రయలు జరగనున్నాయి.