హైద్రాబాద్ బద్నాం: చిరు, జగన్ సహా.. ఉతికేసిన కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో చర్చ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పైన పరోక్షంగా మండిపడ్డారు.
విభజన జరిగితే రైతులకు నీటి ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రి భయపెడుతున్నారన్నారు. అనంతపురంతో సమానంగా పాలమూరు దుర్భిక్షంలో ఉందన్నారు. సాగునీటి వినియోగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. సాగునీటి జలాల పేరిట ముఖ్యమంత్రి సీమాంధ్రులను భయపెడుతున్నారన్నారు. నీటి యుద్ధాలని చెప్పడమేమిటన్నారు. భారత్, పాక్ దేశాలు ఐదు నదుల జలాలను, నైలు నదిని పదకొండు దేశాలు పంచుకుంటున్నాయని అలాంటప్పుడు మనం పంచుకోలేమా అన్నారు.
జాతీయస్థాయిలో ట్రిబ్యునల్లు ఉన్నాయని, నీటి యుద్ధాలు ఎలా జరుగుతాయన్నారు. అక్రమ ప్రాజెక్టులకు నీటి తరలింపు సాధ్యం కాదనే విభజనకు అడ్డంకులు చెబుతున్నారన్నారు. మరొకాయన నిజాం చేయని అభివృద్ధిని తాను తొమ్మిదేళ్లలో చేశానని చెబుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. యుటికి, ఊటికి తేడా తెలియని వారు హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. సమన్యాయం అన్న వారు ఆ తర్వాత సమైక్యం అంటున్నారని జగన్ను ఉద్దేశించి చెప్పారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరం
హైదరాబాదు ఎప్పుడో అభివృద్ధి చెందిందని, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నగరమన్నారు. కానీ ఇప్పుడు సీమాంధ్ర నాయకుల వల్ల హైదరాబాదు పేరు బద్నామ్ అయిందన్నారు. వైయస్ జగన్, గాలి జనార్ధన్ రెడ్డి, మ్యాట్రిక్స్ ప్రసాద్, కోనేరు ప్రసాద్ వంటి వారి కుంభకోణాల వల్ల స్కాం కాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాదును ప్రపంచ పటంలో నిలిపామని డైలాగులు కొట్టే వారు ఇది తెలుసుకోవాలన్నారు. విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన కిరణ్ ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు కూడా విభజకు అంగీకరించారన్నారు. అందరి అంగీకారంతోనే బిల్లు వచ్చిందని, ఏకపక్షం కాదన్నారు.
ప్రతిపాదనలు
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా పదేళ్లు చేయవద్దని, మూడేళ్లు చాలని కెటిఆర్ చెప్పారు. గవర్నర్ చేతిలో శాంతిభద్రతలకు తాము అంగీకరించమన్నారు. ఉద్యోగాలు, పింఛన్లు నేటివిటీ ఆధారంగా ఉండాలన్నారు.