కుప్పం ఎమ్మెల్యే కోరిక నెరవేర్చాం - రాజధానుల అంశంలోనూ : సెంటిమెంట్లు గౌరవిస్తూ- సీఎం జగన్..!!
ఏపీలో కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి ఏపీ 26 జిల్లాల రాష్ట్రంగా రూపు దిద్దుకుందని సీఎం చెప్పుకొచ్చారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా.. ప్రజల ఆకాంక్షలు. .అవసరాల మేరకు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉంటాయని చెప్పారు. ఇవాళ మంచి పనికి శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజుగా అభివర్ణించారు.

ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ
కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయి. అదే విధంగా..గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయని వివరించారు. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఏర్పడిందని చెప్పారు. 1979 జూన్లో విజయనగరం జిల్లా ఏర్పడిందని గుర్తు చేసారు. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగిందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని మార్పులు చేసినట్లు చెప్పారు.

కుప్పం ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు పై
ఇదే సమయంలో సాధన్యమైనంత వరకు మండలం ఒకే నియోకవర్గంలో వచ్చే విధంగా ప్రయత్నం చేసామని చెప్పారు. 12 నియోజకవర్గాల్లో మాత్రం సాధ్యంకాలేదని వివరించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ప్రస్తావించారు. పేరెత్తకుండానే కుప్పం ఎమ్మెల్యే కోరిక మేరకు ఆయన నియోకవర్గాన్ని సైతం రెవిన్యూ డివిజన్ గా మార్చామని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి తన నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయారని.. ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి లేఖ రాస్తూ కోరారని..ఇప్పుడు దానిని ఆమోదించామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. గ్రామ స్థాయిలో పాలనా సంస్కరణ లు తీసుకొచ్చామని.. ఇప్పుడు జిల్లాల ద్వారా వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు.

రాజధానుల విషయంలోనూ ఇదే వైఖరితో
ఇక, రాజధానుల విషయంలోనూ ఇదే రకంగా ముందుకెళ్తామని సీఎం జగన్ స్పష్టం చేసారు. నిన్నటి వరకు సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు అని, ఇంతటి ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలు ఉన్నవి ఏపీలోనే అని అన్నారు. ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19.07 లక్షలు అని వెల్లడించారు. 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన జరిగిందన్నారు. రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలో 15 ఎకరాల్లో కలెక్టర్..ఎస్పీ కార్యాలయాలతో పాటుగా అన్ని ఆఫీసులు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications