ఏ ఎన్నికలొచ్చినా రిజల్ట్ ఇట్లనే ఉంటది: విశ్వసనీయత..విలువలకు పట్టం: జగన్ వెనుకే జనం: రోజా
కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీకి నిర్వహించిన ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. తిరుగులేని ఆధిక్యాన్ని కనపరిచింది. ఇదివరకు గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రదర్శించిన దూకుడును మున్సిపల్ ఎన్నికలోనూ కొనసాగించింది. ఏడు దఫాలుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలను అందుకుంటూ వస్తోన్న చంద్రబాబుకు తొలి సంపూర్ణ పరాజయాన్ని రుచి చూపించింది.
సెంచరీ కొట్టిన టమాటా ధర; మదనపల్లి రైతులకు కాసుల పంట, సామాన్యులకు ధరల మంట!!
కుప్పం ఒకటీ ఒక ఎత్తు..
ఈ విజయం వైఎస్ఆర్సీపీ వర్గాల్లో జోష్ను నింపింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే.. కుప్పం మున్సిపాలిటీలో పాగా వేయడం మరో ఎత్తుగా పరిగణిస్తున్నాయి. గెలుపుపై చంద్రబాబులో ఉన్న ధీమాను సడలించింది ఈ రిజల్ట్. చంద్రబాబు ఇక కుప్పం నుంచి పోటీ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. కొత్త నియోజకవర్గాన్ని వెదుక్కున్నా ఆశ్చర్యపోనక్కర్లేని వాతావరణాన్ని కుప్పంలో సృష్టించింది.
చంద్రబాబును కాదని..
వైసీపీ గెలుచుకోవడానికి ఇక మిగిలి ఉన్నది ఒక్క ఎమ్మెల్యే స్థానమే. కుప్ప మున్సిపాలిటీలో వైసీపీ గెలవడం పట్ల చిత్తూరు జిల్లాకే చెందిన నగరి శాసన సభ్యురాలు ఆర్ కే రోజా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అద్దం పట్టిన అసలు సిసలు ఫలితంగా అభివర్ణించారు. 1989 నుంచి తాము ఎన్నుకుంటూ వస్తోన్న చంద్రబాబు నాయుడిని కాదని, కుప్పం మున్సిపల్ ఓటర్లు వైఎస్ జగన్కు పట్టం కట్టారని అన్నారు.
విజయం పరిపూర్ణం..
కుప్పం నియోజకవర్గంలో ఇదివరకే గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలుచుకున్నామని, మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోవడంతో తమ విజయం పరిపూర్ణమైందని అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ను చివరికి కుప్పం ఓటర్లు కూడా తరిమి కొట్టారని చెప్పారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఓటమితో తండ్రి, కొడుకులు తట్ట, బుట్టా సర్దుకోవాల్సిందేనని, హైదరాబాద్కు స్థిరపడాల్సిందేనని ఎద్దేవా చేశారు.
వార్ వన్సైడ్..
రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా.. వార్ వన్ సైడ్ అవుతుందని ఓటర్లు మరోసారి నిరూపించారని రోజా అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారని ఆమె ఉంటారని అన్నారు. మొన్నటి బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో 90 వేలకు పైగా మెజారిటీని అందించడం అసాధారణమైన విషయమని, అలాంటి ఫలితమే ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికలోనూ వెలువడిందని రోజా వ్యాఖ్యానించారు. 40 సంవత్సరాలు ఇండ్రస్టీ చంద్రబాబును కుప్పం ప్రజలు హైదరాబాద్కే పరిమితం చేశారని అన్నారు.
కుప్పంలో బోల్తా..
ఈ ఫలితాలతోనైనా చంద్రబాబు, నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని రోజా హితవు పలికారు. డిల్లీలో చక్రం తిప్పుతానని చెప్పుకొనే చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీలో బోల్తా కొట్టారని అన్నారు. తమ పార్టీని గెలిపించిన కుప్పం ప్రజలందరికీ రోజా కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వైఎస్ జగన్ ఎప్పుడూ వమ్ము చేయరని చెప్పారు. వైఎస్ జగన్పై ప్రజల్లో నెలకొన్న విశ్వాసమే గెలిపించిందని, ఆయన విశ్వసనీయత గల రాజకీయ నాయకుడని కితాబిచ్చారు.