రాష్ట్ర విభజన: లగడపాటి రాజకీయానికి గండం?

విజయవాడ: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ భవితవ్యం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విడిపోయే సమస్య లేదని, రాష్ట్ర విడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన పదే పదే అంటూ వచ్చారు. అయితే, రాష్ట్ర విభజన ఆగదని కాంగ్రెసు అధిష్టానం గట్టిగా చెబుతున్న క్రమంలో కూడా లగడపాటి రాజగోపాల్ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటూ ఆయన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

రాష్ట్ర విభజనపై ఆయన ప్రతిపక్షాలను మించి కాంగ్రెసు అధిష్టానంపై విమర్శలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో తమ పార్టీ అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందంటూ ఆయన నర్మగర్భంగా చెప్పారు. దాంతో కాంగ్రెసు అధిష్టానం ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. లగడపాటి మాటలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అస్త్రాలుగా మారాయి.

Lagadapati Rajagopal

దానికితోడు, సీనియర్ నాయకులకు కూడా ఆయన దూరమైనట్లు ప్రచారం సాగుతోంది. రాజకీయంగా అనుభవజ్ఞులైన పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులకు లగడపాటి వ్యవహారశైలి పట్ల తీవ్రమైన అసహనానికి గురైనట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షకుడిగా ఆయన ముందు వరుసలో ఉండాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్‌ సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోవడం, కేంద్ర కేబినెట్‌ తెలంగాణ నోట్‌ను ఆమోదించడం వంటివి వేగంగా జరుగుతుండడంతో ఆయనకు ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. గత నెల 24న రాజీనామా ఆమోదింప చేసుకుని ఉద్యమంలో పాల్గొంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ, తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడానికి ఆయన సీరియస్‌గా ప్రయత్నిస్తునారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.

రాష్ట్రం విడిపోదంటూ లగడపాటి చెప్పిన మాటలను నమ్మి తాము మోసపోయామని మాజీ మంత్రి, విజయవాడకు చెందిన కాంగ్రెసు నాయకుడు దేవినేని రాజశేఖర్‌(నెహ్రూ) తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎంపీ మాటలు విశ్వసించటం వల్ల తాము రాజకీయంగా సమాధి అయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానంతో లగడపాటికి కుదిరిన ఒప్పందం ఏమిటో బయటపెట్టాలని నెహ్రూ డిమాండ్‌ చేశారు. దీన్ని బట్టి సొంత పార్టీలోనే లగడపాటికి ఎదురుగాలి వీస్తోందని అర్థం చేసుకోవచ్చు.

గత నెల 24న రాజీనామా ఆమోదింప చేసుకుని విజయవాడకు వస్తానన్న లగడపాటి ఇంత వరకు దర్శనమివ్వకపోవడంతో తమ ఎంపి కనబడటం లేదని నియోజకవర్గ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ద్వారా విజయవాడలో లగడపాటి రాజగోపాల్‌కు చెక్ పెట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్థితిలో లగడపాటి రాజగోపాల్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+