చిట్టా విప్పి దత్తపుత్రుడికి గండికొడ్తా: లగడపాటి హెచ్చరిక
హైదరాబాద్: దత్తపుత్రుడి గేమ్ ప్లాన్కు తాను గండికొడతానని, అందుకు అవసరమైన అస్త్రాలు తన వద్ద ఉన్నాయని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం హైదరాబాదులో అన్నారు. దత్తపుత్రుడితో కలిసి 2014లో మరోసారి అధికారం కోసం చీకటి ఒప్పందాలు చేసుకుంటే ప్రజలు తిరస్కరించడం ఖాయమని ధ్వజమెత్తారు.
తమ రాజీనామాను స్పీకర్ ఆమోదించిన వెంటనే పార్టీలు, వ్యక్తుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలను బయటపెడతానని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నెల రోజులుగా సేకరిస్తున్నానన్నారు. దత్తపుత్రుడు దొరికాడనే కేంద్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, కేంద్రమంత్రులను, పార్లమెంటు సభ్యులను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందన్నారు.
మన రాష్ట్రం నుంచి పంతొమ్మిది మంది ఎంపీలు రాజీనామాలు చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని, అటువంటి పరిస్థితుల్లో విభజనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండబోదన్నారు. కేంద్రంలో ప్రతిపక్ష సభ్యులు రాజీనామాలు చేస్తే త్వరగా ఆమోదిస్తారని, పాలకపక్ష సభ్యులు చేస్తే వాటిని తొందరగా ఆమోదించరన్నారు.
వారికి సంఖ్యాబలం ముఖ్యం కాబట్టి అన్నీ చూసుకుంటారని విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి అనేక మార్గాలున్నాయని చెప్పారు. ప్రధానంగా ఆర్టికల్ 371 డి, ఈ సెక్షన్ల ప్రకారం సంఖ్యాబలం లేకుండా, రాజ్యాంగ సవరణ లేకుండా రాష్ట్రాన్ని విభజించడం సులభం కాదని లగడపాటి అభిప్రాయపడ్డారు.