అమరావతిలో భూ కేటాయింపులు - ఎవరికి ఎంత..!!
రాజధాని అమరావతి పై కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. మధ్యలో నిలిచిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆర్దికంగా వనరులను సమీకరించుకుంటోంది. జనవరి నుంచి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇక, అమరావతిలో భూ కేటాయింపుల పై సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం పలు సంస్థలకు కేటాయింపుల పైన ఆమోదం తెలిపింది.
భూ కేటాయింపులు
అమరావతిలో భూ కేటాయింపుల పైన మంత్రివర్గ ఉప సంఘం పలు నిర్ణయాలు తీసుకుంది. రాజధాని ప్రాతంలో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు వైద్యకళాశాల కోసం 20 ఎకరాల కేటాయింపునకు కమిటీ ఆమోదించింది. 2014-19 కాలంలో నాటి ప్రభుత్వం పలు సంస్థలకు భూములు కేటాయించింది. అయితే, వారికి కేటాయించిన గడువు ముగిసింది. దీంతో, వారికి గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 15 ఎకరాలు కేటాయించింది. బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీ కి 10 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయం
అదే విధంగా.. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు కేటాయించారు. లార్సన్ అండ్ టుబ్రో స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి 5 ఎకరాలు కేటాయింపుకు ఆమోదం లభించింది. టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం తెలిపింది. 131 మందికి గతంలో భూములు ఇచ్చామని వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని వివరించారు. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామని ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని నారాయణ వెల్లడించారు.
నిర్మాణాల ప్రణాళికలు
మంత్రివర్గ ఉప సంఘం ఆమోదించిన విధంగా సంస్థలకు వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపు లు పూర్తవ్వాలని అధికారులకు సూచించారు. అదే విధంగా డిసెంబరు నెలాఖరుకు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని వివరించారు. 2025 జనవరి నుంచి రాజధానిలో పనులు మొదలవుతాయని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమరావతిలో మౌలిక వసతుల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణం మంజూరు అయింది. నిర్మాణాలకు ఆర్దికంగా ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా మూడేళ్ల కాల పరిమితితో నిర్మాణాలు ప్రారంభించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications