TDPలోకి YS ముఖ్య అనుచరుడు..
ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరుగులు తీస్తోంది. అధికారంలోకి రాకపోతే తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ పార్టీ నేతలు అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అధికారమే పరమావధిగా భావించి పనిచేయాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధినేత చంద్రబాబు శ్రేణులకు ఉద్బోధిస్తున్నారు. అధికార పార్టీ తమ ప్రజాప్రతినిధులందరనీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంద్వారా ప్రజలకు చేరువ చేస్తుండగా, ఇదేం ఖర్మ, బాదుడే బాదుడు కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ తమ నేతలను ప్రజలవద్దకు పంపుతోంది.
ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. దీంతోపాటు భాషా అనుచరులు పలువురు పార్టీలో చేరబోతున్నారు. భాషా రాకవల్ల మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ బలోపేతవుతుందని, మైనార్టీల ఓట్లన్నీ గుంపగుత్తగా పడతాయనే ఆశాభావంతో ఉన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షాజహాన్ ఓ వెలుగు వెలిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విభజన అనంతరం మౌనంగా ఉన్నారు. ఏఐసీసీ కీలక సభ్యుడిగా ఢిల్లీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని భాషా తీసుకున్నారు. షాజహాన్ సోదరుడు నవాజ్ భాషా వైసీపీ మదనపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ వలసలు ప్రారంభమయ్యాయి. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా తెలుగుదేశం పార్టీ బాట పడుతుండటంతో తెలుగు తమ్ముళ్లు జోరుమీదున్నారు.












Click it and Unblock the Notifications