శాసనమండలి రద్దుతో రాజకీయ నిరుద్యోగులుగా టీడీపీ నేతలు .. లోకేష్ ఫ్యూచర్ పై టీడీపీలో చర్చ
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది . అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను మండలి ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపటంతో మండలిని రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్ . ఇక ఈ నేపధ్యంలోనే మండలిని రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం ఆమోదం పొందింది .ఇక కేంద్రానికి సైతం మండలి రద్దు బిల్లు పంపిన వైసీపీ ప్రభుత్వం త్వరితగతిన మండలి రద్దుకు ఆమోదం లభిస్తుందని భావిస్తుంది. ఇక ఈ నేపధ్యంలో శాసన మండలిలో మెజార్టీ సభ్యులున్న టీడీపీ నేతలు లబోదిబోమంటున్నారు. కేంద్రం మండలి రద్దు బిల్లు ఓకే అంటే రాజకీయ నిరుద్యోగులుగా మారతామని బాధ పడుతున్నారు.
శాసన మండలిలో బలంగా ఉన్న టీడీపీకి షాక్ ఇచ్చిన జగన్
ఇక అసలు విషయానికి వస్తే ఏపీ శాసన మండలిలో బలంగా ఉన్న టీడీపీకి షాక్ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . మండలిలో చైర్మన్ సహా మొత్తం సభ్యుల బలం 58. అందులో టీడీపీ 28, వైసీపీ 9, పీడీఎఫ్ 5, బీజేపీ 2, ఇండిపెండెంట్ 3, నామినేటెడ్ 8 మంది ఉండగా, 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీ శాసన మండలిలో అత్యధికులు టీడీపీ సభ్యులే వుండటంతో, మండలిలో టీడీపీదే హవా . ఇక అభివృద్ధి వికేంద్రీకరణ బల్లు విషయంలో టీడీపీ మండలి వేదికగా వేసిన స్టెప్స్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీలకు తిప్పలు తెచ్చి పెట్టాయి.
మండలి రద్దుతో 28 మంది టీడీపీ సభ్యులు ఇప్పుడు పదవులు కోల్పోయే పరిస్థితి
శాసన సభ ఆమోదించిన బిల్లును , మండలి తిరస్కరించినా, సెలెక్ట్ కమిటీకి పంపించినా బిల్లును అడ్డుకోవటం కేవలం మూడు నెలలు మాత్రం సాధ్యం తప్ప పూర్తిగా బిల్లు అమలును ఆపలేరు. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ వేసిన ఎత్తుగడ మొదటికే మోసం తెచ్చింది.టీడీపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు అడ్డుతగులుతోందని, వైసీపీ ప్రభుత్వం ఏకంగా మండలిని రద్దు చేసింది. దీంతో టీడీపీకి ఉన్న మొత్తం 28 మంది సభ్యులు ఇప్పుడు పదవులు కోల్పోయే పరిస్థితి వచ్చింది .
పదవి కోల్పోనున్న లోకేష్ .. రాజకీయ భవిష్యత్ పై చర్చ
మూడు నెలలు ఆపగలిగితే ఈ లోగా ఏదైనా చెయ్యొచ్చు అని భావించిన టీడీపీకి రివర్స్ షాక్ ఇచ్చింది వైసీపీ . దీంతో తెలుగుదేశం ఎమ్మెల్సీలు లబోదిబోమంటున్నారు. ఉన్న పదవులు కూడా ఊడిపోవడానికి పార్టీ నిర్ణయమే కారణమని లోలోపల తెగ బాధపడుతున్నారని సమాచారం . ఇక గతంలో మంత్రిగా ,ఇంతకాలం ఎమ్మెల్సీగా లోకేష్ పదవి అనుభవించారు. ఇక ఆయన పదవి కూడా పోతుందని చర్చ జరుగుతుంది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటని పార్టీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో ఎలాగూ బలంలేదు కాబట్టి, కనీసం మండలిలోనైనా తమ స్వరం బలంగా వినిపించేందుకు టీడీపీకి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసింది వైసీపీ .
Recommended Video
రాజకీయ నిరుద్యోగులుగా టీడీపీ నేతలు .. అంతర్మధనంలో ఎమ్మెల్సీలు
ఇంతకాలం ఎమ్మెల్సీగా ప్రోటోకాల్తో పాటు అనేక వసతులు అనుభవించిన నేతలు ఇక ఎమ్మెల్సీ పదవులు పోతే రాజకీయ నిరుద్యోగులుగా మారతామని బాధ పడుతున్నారు. టీడీపీ మండలి సభ్యుల్లో అనవసరంగా పితలాటకం పెట్టుకున్నామన్న భావన కనిపిస్తుంది. అధినేత చంద్రబాబుకు ఎదురు చెప్పకున్నా మళ్ళీ ఎన్నికల వరకు ఎలాంటి పదవులు లేకుండా జనాల్లో ఎలా తిరగాలి అన్న బాధ టీడీపీ ఎమ్మెల్సీలలో ఉంది. ఇక లోకేష్ బాబు పరిస్థితి ఏంటో అన్న చర్చ కూడా పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది.