స్థానిక పోరు: ఇంటి మీద జెండా ఎగిరినా సరే.. జీవితాంతం వెంటాడేలా కేసులు: పోలీసుల వార్నింగ్..!
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పోలీసు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రచార నియమావళికి నిక్కచ్చిగా అమలు చేయడంపై దృష్టి సారించింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే నాయకులను గానీ, కార్యకర్తలను గానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది పోలీసు శాఖ.
Recommended Video
ప్రచారంపై ప్రత్యేక నిఘా..
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు బుధవారం తెరపడబోతోంది. అనంతరం ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం దృష్టి సారిస్తాయి. ఈ ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఆయా పార్టీల కార్యకర్తలు విచ్చలవిడిగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు, మద్యాన్ని పంచడాన్ని ప్రభుత్వం నిషేధించిన ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కార్యకలాపాలపై నిఘా ఉంచింది.
ఇంటి మీద జెండా ఎగిరినా సరే..
ముందస్తుగా ఎన్నికల సిబ్బంది నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇంటి మీద పార్టీ జెండా ఎగురవేసినా, ఎన్నికల గుర్తును అమర్చినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమతులు లేకుండా పార్టీ జెండాలను, ఎన్నికల గుర్తులను అమర్చే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కసారి ఎన్నికల సమయంలో కేసు నమోదైతే.. ఇక జీవితాంతం కూడా ఎన్నికలు జరిగిన ప్రతీసారీ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు.
స్వేచ్ఛగా పోలింగ్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా పోలింగ్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఎలాంటి అల్లర్లకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికలను కొనసాగిస్తామని చెబుతున్నారు. బైండోవర్ కేసులు నమోదైన వారు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లకు రావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తాము ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు సృష్టించబోమంటూ స్థానిక రెవెన్యూ అధికారికి లిఖితపూరకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.