బాబుకి షాక్: సిఆర్డీఏ ఆఫీస్కు తాళం, 'వైసిపిలోకే టిడిపి ఎమ్మెల్యేలు'
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి మంగళగిరి మండలం నీరుకొండలో ఉన్న సిఆర్డీఏ కార్యాలయానికి రైతులు తాళం వేశారు. మొదట సిబ్బందిని బయటకు పంపిన రైతులు.. దానికి తాళమేశారు. తమకు అందజేయాల్సిన చెక్కుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని రైతులు మండిపడుతున్నారు.
తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఆర్డీఏ కార్యాలయానికి తాళం వేయడంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులకు చెక్కుల పంపిణీ విషయంలో ఉన్నతాధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భవిష్యత్తులో టిడిపి ఖాళీ: ఎమ్మెల్యే కాకాని
ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు భవిష్యత్తులో బాధపడే రోజులు వస్తాయని వైసిపి ఎమ్మెల్యే కాకాని అన్నారు. ప్రస్తుతం పార్టీలో ఎవరికీ జగన్ పట్ల అసంతృప్తి లేదన్నారు. జగన్తో మాట్లాడాక ఫిరాయింపుల పైన ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం, చంద్రబాబు రోజురోజుకు ఇమేజ్ కోల్పోతున్నారని, అక్కడ కోల్పోయిన ఇమేజిని ఇక్కడ కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో టిడిపి నుంచి పెద్ద ఎత్తున వైసిపిలోకి వస్తారన్నారు. అప్పుడు టిడిపి ఖాళీ కావడం ఖాయమన్నారు.
అప్పుడు కేసులు.. ఇప్పుడు మంచివాళ్లా: అంబటి
గత అసెంబ్లీ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గెలిచిన తర్వాత ఆయన పైన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు పెట్టించిన టిడిపి ప్రభుత్వానికి, ఇప్పుడు తమ పార్టీలో చేరగానే మంచివాడు అయిపోతారా అని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు.
భూమాకు మంత్రి పదవి కూడా ఇస్తారని చెబుతున్నారని, అలా అవ్వాలంటే ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మళ్లీ సైకిల్ గుర్తు మీద గెలిపించుకోవాలన్నారు. కానీ అలా ఆయనతో నామమాత్రంగా రాజీనామా చేయించి, స్పీకర్ చెవిలో మాత్రం దానిని ఆమోదించవద్దని మంత్రి పదవి ఇస్తారా అని నిలదీశారు.
అదే జరిగితే వైసిపి ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా సంవత్సరాల తరబడి మంత్రిగా పని చేస్తారని, ఇది అనైతికమన్నారు. చట్ట వ్యతిరేక చర్య అని అంబటి అన్నారు. ఇలాంటి అనైతిక చర్యలకు సీఎం పాల్పడుతుంటే ఎలా అన్నారు.
ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు వైసిపి తరఫున సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి అప్పుడు టిడిపిలోకి వెళ్లారన్నారు. తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో అందరికీ తెలుసునన్నారు. ఇదే విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు.
చాలామంది టచ్లో ఉన్నారు: కళా
తమ పార్టీతో పలువురు నేతలు టచ్లో ఉన్నారని, మరింతమంది పార్టీలోకి వస్తారని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు మంగళవారం తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి, మంచివారు వస్తే కనుక చేర్చుకుంటామన్నారు. జగన్ అరాచకవాదని, పట్టిసీమను వ్యతిరేకించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని ఆదినారాయణ రెడ్డి స్వయంగా చెప్పారన్నారు.