లండన్ లో చంద్రబాబు..! భువనేశ్వరి అవార్డుల కోసం..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ లండన్ చేరుకున్నారు. తన భార్య నారా భువనేశ్వరికి అక్కడి సంస్థ ప్రకటించిన రెండు అవార్డులు స్వీకరించేందుకు ఆమెతో కలిసి లండన్ వెళ్లారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీగా , హెరిటేజ్ ఫుడ్స్ వీసీ,ఎండీ హోదాలో ఉన్న భువనేశ్వరికి తాజాగా ఈ రెండు అవార్డులు ప్రకటించారు. ఇందులో డిస్టింగ్విష్ ఫెలోషిప్ తో పాటు గోల్డెన్ పీకాక్ అవార్డు ఉన్నాయి.
ఇవాళ లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు హీత్రో ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరికి అక్కడి తెలుగు కుటుంబాలు ఎదురేగి స్వాగతం పలికాయి.
లండన్ తెలుగు కుటుంబాలను అప్యాయంగా పలకరించిన సీఎం దంపతులు.. వారిని అడిగి అక్కడి పరిస్ధితుల్ని ఆరా తీశారు.
ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి నారా భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోవాల్సి ఉంది.

నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును అందుకోనున్నారు. ప్రజాసేవ,సామాజిక ప్రభావంలో నారా భువనేశ్వరి కృషికి గుర్తింపుగా దీన్ని ప్రకటించారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఈ గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో నారా భువనేశ్వరి అందుకోనున్నారు. నారా భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

ఏపీలో నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే సీఎం చంద్రబాబు ఇప్పుడు తన భార్యకు వచ్చిన రెండు అవార్డు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాస్త బ్రేక్ తీసుకుని లండన్ వెళ్లారు. ఇప్పటికే చంద్రబాబు తాజాగా దుబాయ్ టూర్ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత సీఎం చేస్తున్న రెండో విదేశీ పర్యటన ఇది. అయితే దుబాయ్ పర్యటన అధికారికంగా పెట్టుబడుల కోసం ఉద్దేశించినది కాగా.. ప్రస్తుత లండన్ టూర్ పూర్తిగా వ్యక్తిగతమైనది.












Click it and Unblock the Notifications