ప్రేమ పంచాయితీ : యువకుడిని సిగరెట్లతో కాల్చి, రాడ్లతో కొట్టారు
విజయవాడ : వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరి కులమతాలు వేరు కావడంతో.. పెద్ద మనుషులు పోలీసులు కలిసి ఓ పంచాయితీ పెట్టి ఇద్దరినీ విడగొట్టారు. ఆ తర్వాత ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక.. మళ్లీ అమ్మాయిని కలిసేందుకు ప్రయత్నించాడు సదరు యువకుడు. దీంతో యువకుడిపై కక్ష గట్టిన యువతి కుటుంబం.. అతన్ని తీవ్ర చిత్రహింసల పాలుచేసింది.
వివరాల్లోకి వెళితే.. విజయవాడ పరిధిలోని యనమలకుదురు ప్రాంతానికి చెందిన సుభానీ, వైష్ణవి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి కుల మతాలు వేరుకావడంతో.. కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు ఒప్పుకోలేదు. ఇదే క్రమంలో పెద్ద మనుషులు పోలీసులు కలిసి ఓ పంచాయితీ పెట్టి ఇద్దరినీ విడగొట్టారు.

అయితే కొన్నిరోజుల తర్వాత సుభానీ వైష్ణవిని కలవడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టడంతో.. వైష్ణవి కుటుంబ సభ్యులు ఓరోజు అతడిని పట్టుకుని బంధించారు. ఆపై.. ఒళ్లంతా సిగరెట్ తో కాల్చి, రాడ్లతో తీవ్రంగా కొట్టారు. మూడురోజుల క్రితం అతన్ని కిడ్నాప్ చేసిన యువతి కుటుంబ సభ్యులు.. తీవ్రంగా గాయపడ్డ సుభానీని ఈ ఉదయం రోడ్డు మీద పడేసి వెళ్లినట్లుగా సమాచారం.
అనంతరం సుభానీ స్నేహతులు అతన్ని ప్రభుత్వాసుపత్రిలో చేర్చించారు. ఆసుపత్రికి వచ్చిన సుభానీ తల్లి.. ఒళ్లంతా సిగరెట్ వాతలతో, రాడ్లతో కొట్టిన దెబ్బలతో తీవ్ర వేదనకు గురవుతోన్న కొడుకును చూసి చలించిపోయింది. దీనిపై స్పందించిన సుభానీ.. వైష్ణవి బావ, అతని స్నేహితులు తనను కిడ్నాప్ చేసి ఇష్టమొచ్చినట్లు కొట్టారని మీడియాతో వివరించాడు.
పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తున్నట్లు మభ్య పెట్టి.. మత్తు మందు ఇచ్చారని, ఆపై ఒళల్ంతా వాతలు పెట్టారని కన్నీటి పర్యంతమయ్యాడు. పెద్దలు, పోలీసుల సమక్షంలో పంచాయతీ జరిగిన తర్వాత.. తాను వైష్ణవి ఇంటికి వెళ్లింది లేదని చెబుతున్నాడు సుభానీ. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాల్సిందిగా అతను కోరుతున్నాడు.












Click it and Unblock the Notifications