బంగాళాఖాతంలో అల్పపీడనం... వేడెక్కనున్న ఏపీ
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు వీటి తీవ్రత పెరుగుతోందేకానీ తగ్గడంలేదు. ఎండాకాలంలో ఉంటున్నట్లుగా ఉండటంతోపాటు గాలి ఆడకపోతుండటంతో తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు. మబ్బులు మసకేయడం.. తర్వాత తొలగిపోతుండటంతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ కు, బంగ్లాదేశ్ కు సమీపంలో ఇది స్థిరంగా నిలిచింది.
రానున్న రెండురోజుల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తర్వాత వాయుగుండంగా బలపడుతుందని, తర్వాత జార్కండ్, బెంగాల్ పరిసర ప్రాంతాలమీదుగా ఇది పయనించనుందని తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండంవల్ల తేమగాలులు వెళ్లిపోయాయని, ఈ ప్రభావం మూడురోజులు ఉంటుందని, ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎండలవల్ల ఇప్పటికే అల్లాడిపోతున్న ప్రజలు దీంతో మరింత తీవ్రమైన ఉక్కపోతకు గురికానున్నారు.

ఆగ్నేయ అరేబియా సముద్రానికి ఆనుకొని దక్షిణ కేరళ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. కర్ణాటక, కొంకణ్ తీర ప్రాంతాలమీదుగా ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీనివల్ల ఏపీలోని రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, దీంతోపాటు మోస్తరు వానలు కూడా పడతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications