ఏపీకి హెచ్చరిక: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రమంతటా రెండురోజులపాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, గురువారం నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇవి అల్పపీడనాలుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాతావరణ కేంద్రం ప్రభుత్వానికి సూచించింది.
ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉంది
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంవల్ల రాష్ట్రంతోపాటు యానాంలోని తీర ప్రాంతాల్లో ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల మూడు రోజులు వానలు పడనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే చలి రోజురోజుకు ముదురుతోంది. అయితే పగటివేళ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇటువంటి విభిన్నమైన వాతవరణం నెలకొన్న నేపథ్యంలో వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించివుంది. శుక్రవారం, శనివారాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో మురుములు, మెరుపులతో భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

పంటలకు రైతులు బీమా చేయించుకోవాలి
ప్రస్తుత రబీ సీజన్ లో రైతులు విత్తనాలు చల్లారు. అన్ని పంటలకు ఈ వర్షాలవల్ల నష్టం వాటిల్లే ప్రమాదం కనపడుతోంది. తప్పనిసరిగా రైతులు తమ పంటలకు బీమా చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. జల్లులతో సరిపెడితే మేలు జరిగినట్లేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. సమీపంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో అధికారులను సంప్రదించి పంటబీమా వివరాలు తెలుసుకోవాలని తెలియజేస్తోంది. నంద్యాల, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, విశాఖపట్నం, కృష్ణా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.












Click it and Unblock the Notifications