తెలుగు రాష్ట్రాలపై మమతా చూపు - ప్రశాంత్ కిషోర్ రాయబారం : జగన్ తో కొత్త వ్యూహంతో..!!
వరుసగా మూడో సారి పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టారు. దేశ వ్యాప్తంగా పార్టీని విస్తృతం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న ఆ పార్టీ క్రమేణా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. మూడో సారి ఎన్నికల్లో మమతా గెలవటానికి అంతా తానై వ్యవహరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా మేఘాలయా లో భారీ షాక్ ఇచ్చారు. కొద్ది నెలల్లో జరగనున్న గోవా ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేస్తోంది. అస్సాం, త్రిపుర, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో తృణమూల్ కాం గ్రెస్ వేగంగా అడుగులు వేస్తోంది.

బీజేపీకి వ్యతిరేకంగా మమతా అడుగులు
త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధవుతోంది. ఇందులో భాగంగా దక్షిణాన ఏపీ..తెలంగాణ రాష్ట్రాల గురించి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ..తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే తెలంగాణలోని కొద్దిమంది కాంగ్రెస్ కీలక నేతలతోపాటు టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏపీ..తెలంగాణ రాజకీయాల పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్ ఈ ఆపరేషన్ బాధ్యతలు తీసుకున్నారు.

తెలంగాణలో ప్రయోగానికి సిద్దం
తెలంగాణలో పార్టీ ఏర్పాటు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలతో తృణమూల్ సీనియర్ నేత ఒకరు చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్న కొంతమంది అధికార పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపైనా వారితో మాట్లాడినట్లు తెలిసింది. ఇటీవలి హుజురాబాద్ ఎన్నికలపైనా తృణమూల్ అధినేత్రికి సంబంధిత పైన ఐ ప్యాక్ టీం పూర్తి నివేదిక అందించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ సాధించిన ఓట్ల విషయంలోనూ లోతైన అధ్యయనం చేసి మరీ నివేదిక అందించినట్టు తెలుస్తోంది.

పార్టీ ఎంపీ చెప్పిన మాటలతో చర్చ మొదలు
తెలంగాణలోనూ పార్టీ విస్తరణ ఉంటుందని.. అయితే, ఇందుకు మరికొంత సమయం ఉందంటూ టీఎంసీ ఎంపీ ఢిల్లీలో చెప్పిన మాటలు..ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ లేదా షర్మిల పార్టీతో పొత్తు అంశం పైనా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరితో వెళితే ప్రయోజనం ఉంటుందనే కోణంలో చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, జాతీయ స్థాయిలో కేసీఆర్ - మమతా పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయనే చర్చ సాగుతున్న సమయంలో ఇప్పుడు కొత్త ట్విస్టుగా మారుతోంది.

ఏపీలో పీకే- జగన్ కొత్త వ్యూహాలు
ఇక, ఏపీ రాజకీయాల్లో జగన్ వచ్చే ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ టీంతో ఒప్పందం చేసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రులతో ఆ విషయాన్ని చెబుతూ..వచ్చే ఏడాది నుంచే వారు పని చేయటం మొదలు పెడతారని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం వైసీపీ బలంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ బలహీనంగా ఉందనేది వైసీపీ నేతల అంచనా. అయితే, అనేక కారణాలతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రభుత్వం పైన ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అదే సమయంలో తిరిగి టీడీపీ 2014 ఎన్నికల తరహాలో నే బీజేపీ - జనసేనతో పొత్తు కోసం అడుగులు వేస్తోందని..మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని భావిస్తున్నారు.

ఏపీలో మనుగడ సాధ్యమేనా..
దీంతో పాటుగా ఏపీలో రాజకీయంగా సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. .ఈ సారి వైసీపీ..టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని..అందు కోసం కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, తిరిగి అధికారంలోకి రావాలంటే..సానుకూల ఓటు వైసీపీకి వచ్చినా..వ్యతిరేక ఓటు ఎంతగా చీలితే అంత వైసీపీకి ప్రయోజనం కలుగుతుందనేది అధికార పార్టీ ముఖ్యనేతల అభిప్రాయంగా కనిపిస్తోంది.

పీకే వ్యూహాలు..నిర్ణయాలకే కీలకంగా
ఇందు కోసం టీఎంసీ లాంటి బీజేపీ వ్యతిరేక పార్టీ రంగంలో ఉంటే.. అటు వైసీపీ..ఇటు టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు కొత్త పార్టీ వైపు చూస్తారంటూ విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగానే.. వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, పూర్తిగా బెంగాల్ కు చెందిన పార్టీ...విస్తరణలో భాగంగా ఏపీకి వస్తే అక్కడి ఓటర్లు ఆదరిస్తారా అనేది సందేహమే. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అమలు చేసే వ్యూహాలు కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications