రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి విధ్వంసం.. !!
బిహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నిరసన పాట్నాలోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద హింసాత్మకంగా మారింది. రైళ్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రైల్వే స్టేషన్లో గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో రాత్రంతా తీవ్ర ఉద్రిక్తతత కొనసాగింది. నిరసనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించారు.
బిహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ పరీక్షలు నేడు జరగాల్సి ఉంది. దీనికోసం విద్యార్థులు తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లడానికి రైళ్ల మీద ఆధారపడ్డారు. వందలాది మంది అభ్యర్థులు స్టేషన్ ప్రాంగణంలో గుమిగూడారు. సకాలంలో రైళ్లు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. రైల్వే ట్రాక్లపైకి వెళ్లారు. రైళ్లను నిలిపివేశారు. ట్రాక్లను బ్లాక్ చేశారు. రాళ్ల దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకోవడానికి ఆర్పీఎఫ్, జీపీఎఫ్, పోలీసులు ప్రయత్నిచడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

భద్రతా సిబ్బంది ముందుగా నిరసనకారులను సముదాయించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్ లపై కూర్చున్న విద్యార్థులు అక్కడి నుంచి కదల్లేదు. రైళ్లను వెళ్లనివ్వలేదు. దీంతో ఆర్పీఎఫ్, జీపీఎఫ్ సిబ్బంది వారిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్ల దాడికి దిగారు. ఉద్రిక్తత పెరగడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ రాళ్లదాడిలో ఓ రైలు అద్దాలు పగిలాయి. ప్లాట్ ఫామ్ పై గల కుర్చీలు, ఫ్యాన్లు విరిగాయి. ఈ ఘటన తర్వాత పాటలీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ పరిసరాల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తకుండా రైల్వే, పోలీసు అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
#WATCH | Patna, Bihar: Visuals of the vandalised train coach at Patliputra Railway Station following the stone-pelting incident earlier today.
— ANI (@ANI) June 14, 2026
Senior officials are on the spot to assess the situation, and a heavy police deployment remains at the station to maintain law and… pic.twitter.com/fTD19xbpyp
ఈ ఘటనపై పాట్నా జిల్లా కలెక్టర్ త్యాగరాజన్ మాట్లాడారు. అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని, అప్పటికే రెండు రైళ్లు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. నిరసనకారుల మధ్య అసాంఘిక శక్తులు కలిసిపోయి రాళ్లు విసరడం ద్వారా హింసకు దారితీశాయని వ్యాఖ్యానించారు. రైల్వే స్టేషన్ వద్ద అల్లర్లు జరుగుతున్నాయనే సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను తరలించామని, పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని అన్నారు.
#WATCH | Patna, Bihar: Visuals from Patliputra Railway Station where stone-pelting and vandalism incident happened. https://t.co/2ieqtruNFy pic.twitter.com/3oBoZKDkW0
— ANI (@ANI) June 14, 2026












Click it and Unblock the Notifications